Russia : మరోసారి రష్యాపై ఉక్రెయిన్ దాడి చేసింది. రాత్రికి రాత్రే పెద్దసంఖ్యలో డ్రోన్ల ను ప్రయోగించింది. ఈ కారణంగా బుధవారం తెల్లవారుజామున రష్యా దక్షిణ ప్రాంతంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా రోస్తోవ్ ప్రాంతంలో డజన్ల కొద్దీ అపార్ట్మెంట్లలోని వారిని ఖాళీ చేయించాల్సి వచ్చిందని వివరించారు.

రోస్తోవ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన 29 డ్రోన్లు
ఈ ఘటనపై రష్యా రక్షణ మంత్రిత్వశాఖ టెలిగ్రామ్లో స్పందించింది. రాత్రికి రాత్రే 158 ఉక్రెయిన్ డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్చివేశాయని ప్రకటించింది. ఇందులో రోస్తోవ్ ప్రాంతంలోకి చొచ్చుకొచ్చిన 29 డ్రోన్లు కూడా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ దాడి ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయం తెలియరాలేదు. అయితే.. రోస్తోవ్ ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించామని ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు.
ఉక్రెయిన్ ఎన్ని డ్రోన్ల ప్రయోగించిందన్న సమాచారం లేదు
158 డ్రోన్లను కూల్చినట్లు రష్యా అధికారులు వెల్లడించినప్పటికీ.. అసలు ఉక్రెయిన్ ఎన్నింటిని ప్రయోగించిందన్న విషయంపై మాత్రం సమాచారం లేదు. కూల్చివేసిన డ్రోన్లలో రష్యాలోని క్రాస్నోడర్ ప్రాంతంలో 69.. ఉత్తర ఒస్పేటియా ప్రాంతంలో 15 డ్రోన్లు ఉన్నట్లు తెలిపింది. అయితే.. ఈ దాడులపై ఉక్రెయిన్ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో ఇరువైపులా కీలక మౌలిక సదుపాయాల విధ్వంసమే లక్ష్యంగా ఇలాంటి దాడులు జరుగుతున్నాయి.
Read Also : రేపు భారత్కు ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహావుర్ రాణా