RBI Interest Rates : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ), దేశంలోని రుణగ్రహీతలకు ‘రెండోసారి’ ఊరట కల్పించింది. బ్యాంక్ వడ్డీ రేట్లను ప్రభావితం చేసే రెపో రేటును 0.25 శాతం (0,25%) లేదా 25 బేసిస్ పాయింట్లు (25 bps) తగ్గిస్తూ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా, ఇప్పుడు, రెపో రేటు పావు శాతం తగ్గుతుంది. అంటే, రెపో రేట్ ప్రస్తుతం ఉన్న 6.25 శాతం నుంచి ఇప్పుడు 6.00 శాతానికి దిగి వస్తుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు, కారు రుణాలు, విద్యా రుణాలు, కార్పొరేట్ రుణాలు, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గుతాయి.

వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది
ఆర్బీఐ ఎంపీసీ ఫలితాలను కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కూడా, మొదటిసారి, రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అప్పుడు రేట్లు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి చేరాయి. ఈ సందర్భంగా స్థిర వైఖరి నుంచి సర్దుబాటు విధానానికి మరాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. వడ్డీరేటు తగ్గింపుతో గృహ, వాహన, ఇతర రుణాల వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉంది. కాగా ఐదేళ్ల తర్వాత గత ఫిబ్రవరి నాటి ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లలో 25 బేసిస్ పాయింట్లను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి జరిగిన సమావేశంలోనూ మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించారు. ఈ మేరకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ పరిణామాల మధ్య ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగొచ్చింది
ప్రస్తుతం దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ దశలోనే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.6 శాతానికి దిగొచ్చింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేట్లను తగ్గించింది. దీనికి తోడు ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ప్రభావం కారణంగా ప్రపంచ వాణిజ్యంపై ఆందోళనలు పెరిగాయి. అమెరికాకు కీలక ఎగుమతిదారుగా ఉన్న భారత్లో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనేందుకు, దేశీయంగా వినియోగం, పెట్టుబడుల సామర్థ్యాన్ని కొనసాగించేందుకు రేట్లపై ఆర్బీఐ కోత విధించింది.
Read Also: భారత ఉత్తమ కంపెనీగా టీసీఎస్