దేశవ్యాప్తంగా కంచె-గచ్చిబౌలి వివాదం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదే తరుణంలో, తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యూనివర్సిటీ పరిసరాల్లో ఒక జింకపై కుక్కల దాడి జరిగిన ఘటన విద్యార్థుల మధ్య ఆందోళన రేపింది. కుక్కల దాడికి గురైన జింకను స్థానిక సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి హాస్పిటల్ తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా అది మరణించింది.
జింకల మరణాలకు ప్రధాన కారణాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాలు ప్రకృతి సోయగాలతో, హరిత వాతావరణంతో మిళితమై ఉంటాయి. ఇది అనేక వన్యప్రాణులకు సహజవాసంగా మారింది. అయితే, గత కొన్నేళ్లుగా యూనివర్సిటీ పరిసరాల్లో జింకలు అధిక సంఖ్యలో మృతి చెందుతున్నాయి.

కుక్కల దాడులు
క్యాంపస్లోకి అనధికారికంగా ప్రవేశించిన వీధి కుక్కలు జింకలపై దాడి చేస్తున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. స్థానిక విద్యార్థుల సమాచారం ప్రకారం, గత ఐదేళ్లలో 300కి పైగా జింకలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
నీటి సమస్య & వాతావరణ మార్పులు
వేసవి కాలంలో వన్యప్రాణులకు తాగునీటి లభ్యత పెద్ద సమస్యగా మారింది. యూనివర్సిటీ పరిసరాల్లో ఉన్న కొద్ది నీటి మూలాలను జింకలు ఆశ్రయిస్తున్నాయి. అయితే, వాటికి నీరు తాగే సమయంలో ఇతర జంతువుల నుంచి, ముఖ్యంగా కుక్కల నుంచి ముప్పు ఏర్పడుతోంది. హెచ్సీయూ పరిసరాల్లో అభివృద్ధి పనులు, నిర్మాణాలు జరుగుతుండటంతో జింకల సహజ వాతావరణం తగ్గిపోతోంది. జీవావరణ సమతుల్యత దెబ్బతినడంతో, అవి ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాయి.
జంతు సంరక్షణ చర్యల లోపం
ఈ సమస్యకు సంబంధించి పలుమార్లు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులకు ఫిర్యాదులు చేసినా, పరిష్కారంగా తాత్కాలికంగా కుక్కలను పట్టివేసి నగర శివారుల్లో వదిలేస్తున్నారు. అయితే, మరికొంతకాలానికి తిరిగి కొత్త కుక్కలు రావడం వల్ల పరిస్థితి మారడం లేదు. ఈ తరహా ఘటనలు తరచూ జరుగుతుండటంతో విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు- క్యాంపస్లో నీటి వనరులను పెంచాలి. కుక్కల నియంత్రణకు శాశ్వత ప్రణాళిక తీసుకురావాలి. జింకల కోసం ప్రత్యేక అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలి. GHMC అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి. వన్యప్రాణి నిపుణుల ప్రకారం, ఈ సమస్యను పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. క్యాంపస్లో వన్యప్రాణుల కోసం ప్రత్యేక జల వనరులను ఏర్పాటు చేయడం, వీధి కుక్కల నియంత్రణ కోసం GHMC, అటవీ శాఖ కలిసి పనిచేయడం అనివార్యంగా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు చనిపోయిన జింక సంఖ్య 6 గా విద్యార్థులు చెబుతున్నారు. హెచ్ సీ యు తాజా ఆందోళనల అనేపథ్యంలో జింక మరణం కలకలం సృష్టిస్తోంది.