అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల భయం వెంటాడుతున్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ తన స్థిరత్వాన్ని ప్రదర్శించింది. నిన్నటి నష్టాలను దాటుకుని, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ రికవరీతో సెన్సెక్స్ 592.93 పాయింట్లు పెరిగి 76,617.44 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో ఈ సూచీ గరిష్ఠంగా 76,680.35, కనిష్ఠంగా 76,064.94 పాయింట్ల మధ్య ఊగిసలాడింది.నిఫ్టీ కూడా అదే దిశగా పయనించి 166.65 పాయింట్లు లాభపడి 23,332.35 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ గరిష్ఠంగా 23,350, కనిష్ఠంగా 23,158.45 పాయింట్లను తాకింది. సెన్సెక్స్లోని 30 ప్రధాన స్టాక్స్లో 21 లాభాల్లో ముగిశాయి. జోమాటో టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి ఇండియా, టెక్ మహీంద్రా షేర్లు లాభపడిన స్టాక్స్లో ముందంజలో నిలిచాయి.అయితే అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బజాజ్ ఫిన్ సర్వ్ షేర్లు నష్టపోయాయి.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లోని అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగియగా, నిఫ్టీ రియాల్టీ సూచీ 3.61% పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు 2.51% వరకు లాభపడ్డాయి.”ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య భారత మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. కీలక రంగాల్లో పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడం ఇందుకు ప్రధాన కారణం” అని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. మార్చి నెలలో భారతదేశ ఉత్పాదక శక్తి పీఎంఐ ఎనిమిది నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో కార్పొరేట్ ఆదాయాలు మెరుగవుతాయని అంచనా వేయడం మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలపరిచాయి. భవిష్యత్తులో ఈ ట్రెండ్ కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.