Anchor Shyamala : వైసీపీ నాయకురాలు, యాంకర్ శ్యామల ఆన్ లైన్ బెట్టింగ్ ను ప్రమోట్ చేశారనే కేసులో ఈరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో శ్యామలను పోలీసులు దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ… నాకు చట్టాలపై నమ్మకం ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు . నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిది . ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయను అన్నారు. పోలీసుల విచారణకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నట్లు తెలిపారు.

ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది
బెట్టింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. అందుకే దానిపై స్పందించలేను అంటూ శ్యామల చెప్పారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది. వీరిలో టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూ చౌదరిని పోలీసులు విచారించారు. అయితే, విష్ణుప్రియ, రీతూచౌదరి ఈనెల 25న మళ్లీ విచారణకు రావాలని పోలీసులు సూచించారు. యాంకర్ శ్యామల తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెను అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించాలని శ్యామలకు కోర్టు సూచించింది. దీంతో ఆమె పంజాగుట్ట పోలీసుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు.