Om Birla: ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్ సభకు రావడం పై లోక్ సభ స్పీకర్ ఓంబిర్ల అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నియమాలకు ఇది విరుద్ధం అని తెలిపారు. అనంతరం సభను కొద్దిసేపు వాయిదా వేశారు. నిబంధనలు, విధానాలతో సభలు నిర్వహిస్తారు. సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ప్రతిపక్ష పార్టీలోని కొంతమంది ఎంపీలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇది సరైనది కాదని.. ఎంత పెద్ద నాయకుడు అయినా సభ గౌరవాన్ని తగ్గించే ఇలాంటి దుస్తులు ధరించడం ఆమోదయోగ్యం కాదన్నారు.

దీనిపై పార్లమెంటు వెలుపల నిరసనలు
నియోజకవర్గాల పునర్విభజన పై కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే ల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో గురువారం డీఎంకే సభ్యులు నినాదాలు రాసి ఉన్న టీషర్టులు ధరించి పార్లమెంటుకు వచ్చారు. పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలి. తమిళనాడు పోరాడుతుంది. తమిళనాడు గెలుస్తుంది అనే నినాదాలు టీ షర్టులపై రాసి ఉన్నాయి. దీనిపై పార్లమెంటు వెలుపల నిరసనలు తెలిపారు. లోక్సభలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించారు.