పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ నోష్కి ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాల కాన్వాయ్పై తీవ్రవాద దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు పాక్ సైనికులు అమరులయ్యారు,13 మంది గాయపడ్డారు.ఇంతలో, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఏ) ఈ దాడికి బాధ్యత వహిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో దాదాపు 90 మంది సైనికులు మరణించారని తెలిపింది. మరోవైపు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున అంబులెన్స్లు, పాక్ సైనిక దళాలు చేరుకుంటున్నాయి. అటు సమీప ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
అంతర్గత ఉద్రిక్తతలు
జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ తర్వాత పాకిస్తాన్లో అంతర్గత ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా, ఆదివారం (మార్చి 16) బలూచిస్తాన్లో ఆర్మీ కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( బిఎల్ఏ) బాధ్యత వహించింది. ఈ దాడిలో 90 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులను చంపినట్లు బిఎల్ఏ పేర్కొంది. అయితే దానికి విరుద్ధంగా పాకిస్థాన్ ప్రకటన చేసింది.
పాకిస్తాన్ సైన్యం లక్ష్యం
ఈసారి బలూచ్ ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడి పుల్వామా దాడిని పోలి ఉండటం విశేషం. బలూచిస్తాన్లోని నోష్కిలో భద్రతా దళాలకు చెందిన ఏడు బస్సులు, రెండు కార్ల కాన్వాయ్పై దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు మరణించగా, 13 మంది సైనికులు గాయపడ్డారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడి గురించి బిఎల్ఏ సమాచారం ఇస్తూ, ఈ దాడిలో సుమారు 90 మంది సైనికులు మరణించారని పేర్కొంది.
అత్యవసర పరిస్థితి
ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం నోష్కి, ఎఫ్సి క్యాంప్కు తరలించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నందున, మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని నోష్కి ఎస్ హెచ్ఓ సుమనాలి తెలిపారు. అయితే ఈ దాడి తర్వాత, అనేక అంబులెన్సులు, భద్రతా దళాలు సంఘటనా స్థలం వైపు వెళుతున్నట్లు కనిపించాయి,మరోవైపు సమీప ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
ఆత్మాహుతి దాడి
దాడి తర్వాత, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ( బిఎల్ఏ) ఆత్మాహుతి విభాగం అయిన మజీద్ బ్రిగేడ్ కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్ సిడి హైవేపై రక్షన్ మిల్ సమీపంలో ఆత్మాహుతి దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ సైన్యం కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుంది. కాన్వాయ్లో ఎనిమిది బస్సులు ఉండగా, వాటిలో ఒకటి పేలుడులో పూర్తిగా ధ్వంసమైంది. దాడి జరిగిన వెంటనే, బిఎల్ఏ కు చెందిన ఫతే స్క్వాడ్ ముందుకు కదిలి ఒక బస్సును పూర్తిగా చుట్టుముట్టి, అందులోని సైనికులందరినీ దాడి చేసి చంపిందని ఆ సంస్థ తెలిపింది. పాకిస్థాన్ సైనిక సిబ్బందిని ఒక క్రమపద్ధతిలో చంపింది. దీంతో మొత్తం శత్రువుల మరణాల సంఖ్య 90కి చేరుకుందని బిఎల్ఏ పేర్కొంది.