తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియా బాధ్యతలపై ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం అని ఆయన గుర్తు చేస్తూ, గౌరవంగా, నిజాయితీగా వార్తలు అందిస్తే ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే, పచ్చి అసత్య ప్రచారాలు, వ్యక్తిగత విమర్శలు, అవాస్తవ కథనాలు రాసేవారిపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

మీడియా పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “పత్రికారైతే అబద్ధాలు చెప్పాలా? తప్పుడు ప్రచారాలు చేయాలా? వాస్తవాల ఆధారంగా సముచితంగా విశ్లేషణ చేసేవారిని గౌరవిస్తాం. కానీ, ఎవరు పడితే వాళ్లు, ఐడీ కార్డు లేకుండా, సోషల్ మీడియా ముసుగులో ప్రొఫెషనల్ జర్నలిస్టుల్లా వ్యవహరిస్తూ అసభ్య పదజాలం ఉపయోగిస్తే, దాన్ని సహించబోం” అని స్పష్టం చేశారు. అలాగే, “మీడియా సంఘాల నాయకులు, జర్నలిస్టుల లిస్ట్ ఇవ్వాలి. ఆ లిస్ట్లో ఉన్నవారు తప్పు చేస్తే శిక్షించడానికి మేము రెడీ. కానీ, లిస్ట్లో లేని వ్యక్తి ‘జర్నలిస్టు’ అంటూ వ్యవహరిస్తే, అతనిని క్రిమినల్గా పరిగణించాలి. అలాంటి వాళ్లను ముసుగు ఊడదీసి బట్టలు ఊడదీసి కొడతాం” అంటూ రేవంత్ రెడ్డి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకి నిజమైన సమాచారం అందించే బాధ్యత జర్నలిస్టులకు ఉంది. కానీ కొందరు వ్యక్తిగత కక్షతో వ్యవహరిస్తూ, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అలాంటి వారిని మీడియా వర్గాలు అంగీకరించకపోతే, ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. జర్నలిజం పేరుతో అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ, వ్యక్తిగత దూషణలు చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆడపిల్లలపై అసభ్యంగా పోస్టులు పెడితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సీఎం హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నాను, నా గురించి విమర్శిస్తే పట్టించుకోను. కానీ నా కుటుంబ సభ్యుల గురించి, ఇతర ఆడపిల్లల గురించి అసభ్యంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. అని సీఎం పేర్కొన్నారు.