TG Assembly : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీల్లో రుణమాఫీపై చర్చ జరిగింది. ఈ క్రమంలో పల్లా వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై మంత్రులు మాటల దాడికి దిగారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. జనగామకి రండి, ఏ ఊరికి ఐనా రండి.. పూర్తి స్థాయిలో రుణమాఫీ అయినట్టు చెప్తే.. తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పల్లా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

టీచర్ రిక్రూట్ మెంట్ ఎవరు ఇచ్చారు?
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పల్లా విద్యాసంస్థలు నడుపుతారు. లెఫ్ట్ నుండి వచ్చారు.. వాస్తవాలు చెప్తారు అని అనుకున్నాం. కానీ ఇంత బ్లైండ్గా మాట్లాడతారు ఏంటని ప్రశ్నించారు. మీరు చూసిన సీఎంలాగా.. ఇప్పుడు సీఎం చేయడు అని అన్నారు. టీచర్ రిక్రూట్ మెంట్ ఎవరు ఇచ్చారు. ఇంకో ఐదారు వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తాం అని చెప్పారు. సీఎం ఎంత సీరియస్గా తీసుకున్నారో అర్ధం చేసుకోండని అన్నారు. అలాగే వీసీలను అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ నియమించాము అన్నారు.
అదనంగా భవనాల నిర్మాణం కోసం ఆదేశాలు
40 శాతం డైట్ చార్జీలు పెంచాం.. 200 శాతం కాస్మటిక్ ఛార్జీలు పెంచామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మహిళా యూనివర్సిటీని ఎప్పుడైనా మీరు వెళ్లి చూశారా అని ప్రశ్నించారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ చూశారా మీరు.. మేము వెళ్లి చూసి నిధులు ఇచ్చామని భట్టి తెలిపారు. రూ.15 కోట్లు వెంటనే విడుదల చేశాం.. ఇంకో రూ.540 కోట్లు అదనంగా భవనాల నిర్మాణం కోసం ఆదేశాలు ఇచ్చామన్నారు. మీ సీఎం లాగా గాలికి వదిలేయలేదు మా సీఎం అని భట్టి విక్రమార్క చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో యూనివర్సిటీ ఇచ్చేయలేదు.. మా సీఎం మీ లాగ కాదని బీఆర్ఎస్ పై మండిపడ్డారు.