ప్రధాని మోదీ ఆ దేశాధ్యక్షుడికి ప్రత్యేక బహుమతులు రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మారిషస్ చేరుకున్నారు. పదేళ్ల విరామం తర్వాత ఆయన ఈ దేశాన్ని సందర్శించడం విశేషం. మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్ చేరుకున్న మోదీకి ఘన స్వాగతం లభించింది. అక్కడి ప్రజలు సంప్రదాయ బీహారీ భోజ్పురి సంగీతం ‘గీత్ గవాయ్’తో మోదీకి సాదర అభినందనలు తెలిపారు. ఆయనను మారిషస్ ప్రధాని నవీన్ రామ్గోలామ్ ఆహ్వానించారు.ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన కానుకగా పవిత్ర గంగాజలాన్ని అందజేశారు.

ఈ గంగాజలం మహాకుంభ్ మేళా నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చినది.అదనంగా మారిషస్ అధ్యక్షుడికి బీహారీ సూపర్ ఫుడ్ ‘మఖనా’ను కూడా బహుమతిగా ఇచ్చారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదిగా ప్రసిద్ధి చెందింది.అంతకుముందు మారిషస్ ప్రధాని నవీన్ రామ్గోలామ్తో కలిసి ప్రధాని మోదీ సర్ సీవూసాగర్ రామ్గులం బొటానికల్ గార్డెన్లో ఒక మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజలలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం మారిషస్ అధ్యక్షుడు ఇచ్చిన ప్రత్యేక విందులో మోదీ పాల్గొన్నారు.ఈ పర్యటనలో మరో ముఖ్యమైన సంఘటనగా భారత సంప్రదాయ కళలకు సంబంధించిన ఒక అపురూప బహుమతిని మోదీ అందించారు.
మారిషస్ ఫస్ట్ లేడీ వ్రిందాకు బనారస్ చీరను బహుమతిగా ఇచ్చారు. ఈ చీరలు భారతీయ వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ అద్భుతమైన రాయల్ బ్లూ రంగులో ఉన్న బనారస్ చీరను ప్రత్యేకంగా గుజరాత్ లో తయారైన సడేలి పెట్టెలో ఉంచి అందజేశారు. సడేలి పెట్టెలు విలువైన వస్త్రాలు, నగలు, ఇతర స్మారక చిహ్నాలను భద్రంగా ఉంచేందుకు ఉపయోగిస్తారు.ప్రధాని మోదీ పర్యటన కేవలం రాజకీయ సంబంధాల బలోపేతానికి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటేందుకు కూడా ఓ నిదర్శనంగా నిలిచింది. మారిషస్ ప్రజల ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటన ద్వారా భారతదేశం మరియు మారిషస్ మధ్య మరింత బలమైన సంబంధాలు ఏర్పడే అవకాశముంది.