హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అంటే మహిళా దినోత్సవం రోజు రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకోవడం కాదని, ఆచరణలో చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఓ కార్యాక్రమంలో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ప్రతినెలా రూ.2,500లు ఇస్తామని 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రతి మహిళకు తులం బంగారం, స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, బడ్జెట్లో మహిళా సంక్షేమానికి తగిన నిధులు ఖర్చు చేయడం లేదన్నారు.

హామీని గాలికొదిలేశాని ఫైర్
మద్యం ఏరులై పారి మహిళల జీవితాలు ఛిద్రమవుతున్నా ప్రభుత్వం పట్టింపులేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులు లేకుండా చేస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేశాని ఫైర్ అయ్యారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మహిళలు ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా చేయకుండా మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళలను శక్తిగా మారుస్తామంటూ ఊకదంపుడు ఉప న్యాసాలు, పెద్ద పెద్ద ప్రకటనలు, హోర్డింగ్స్, ఫెక్సీలు, సభలు, సమావేశాలు పెడితే ఎవరు నమ్మవరని ఎద్దేవా చేశారు.
మాటలతో మభ్యపెట్టే పాలకులు
రాణిరుద్రమదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న నా తెలంగాణ మహిళలు చైతన్య వంతులని అన్నారు. మాటలతో మభ్యపెట్టే పాలకులకు, పార్టీలకు సమయం రాగానే కర్ర కాల్చివాత పెట్టడం తథ్యమని ఆక్షేపించారు. మహిళల పేరుతో 8 కోట్ల కుటుంబాలకు నల్లా కనక్షన్లు, 25 కోట్ల మంది స్త్రీలకు జన్ధన్ బ్యాంక్ అకౌంట్లు, దాదాపు 25 కోట్ల మంది మహిళలకు రూ.10 లక్షల కోట్లు పీఎం ముద్రా యోజన కింద ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాలిచ్చి మహిళలు ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు.