ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం సహాయక చర్యలు 14వ రోజుకి చేరుకున్నాయి. రెస్క్యూ బృందాలు ‘ఆపరేషన్ డి’ని అమలు చేస్తూ మరింత వేగంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ ఆపరేషన్లో భాగంగా కేరళకు చెందిన రెండు డాగ్ స్క్వాడ్ బృందాలను సెర్చ్ ఆపరేషన్ కోసం రంగంలోకి దించారు.
డాగ్ స్క్వాడ్
టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలాలను ఉపయోగిస్తున్నారు. కేరళ వాయనాడ్ వరదల సమయంలో కీలకంగా పనిచేసిన ఈ డాగ్ స్క్వాడ్, మట్టిలో చిక్కుకున్న మృతదేహాలను గుర్తించడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగివుంది. 20 అడుగుల లోపల ఉన్న ఏదైనా శరీరాన్ని వాసన ద్వారా గుర్తించగలిగే సామర్థ్యం వీటికి ఉంది.
కన్వేయర్ బెల్ట్
నేటి సహాయక చర్యల్లో మరో కీలక అప్డేట్ ఏమిటంటే, కన్వేయర్ బెల్ట్ మిషన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చింది. ఇది సహాయక చర్యలకు మరింత వేగాన్ని అందించనుంది. ప్రమాదం 14వ కిలోమీటర్ వద్ద చోటుచేసుకోగా, 13.5 కిలోమీటర్ల వరకు కన్వేయర్ బెల్ట్ను సింగరేణి, జీపీ కంపెనీ ఇంజినీర్లు రీస్టార్ట్ చేశారు.కన్వేయర్ బెల్ట్ పని చేయడం ప్రారంభించడంతో మినీ ప్రోక్లైనర్ను ఉపయోగించి మట్టి తవ్వకాలను వేగంగా జరిపేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. గత 13 రోజులుగా కేవలం మాన్యువల్గా తవ్వకాలు జరుపుతుండగా, నేటి నుంచి యంత్రాలను వినియోగించి సహాయక చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు.

GPR మిషన్
గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ మిషన్ ద్వారా అందిన డేటా ఆధారంగా సహాయక బృందాలు తవ్వకాలను నిర్వహిస్తున్నాయి. ఇది టన్నెల్లోని లోపల మట్టి కదలికలను, ఖాళీలను గుర్తించి సహాయక చర్యలకు మార్గనిర్దేశం చేస్తోంది.
ప్రభుత్వం చర్యలు
సహాయక చర్యల కోసం అనేక విభాగాల నుంచి బృందాలు పని చేస్తున్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF), జాతీయ భద్రతా సంస్థల ప్రత్యేక బృందాలు కలిసి పనిచేస్తున్నాయి. టన్నెల్లో మరింత లోతుగా ఉన్న ప్రాంతాలను అంచనా వేసేందుకు ప్రత్యేక కెమెరాలను ఉపయోగిస్తున్నారు.14 రోజులుగా కొనసాగుతున్న ఈ సహాయక చర్యలు విజయవంతం కావాలన్నదే అందరి ఆకాంక్ష. కార్మికులను సురక్షితంగా వెలికితీయడానికి రెస్క్యూ బృందాలు అన్నివిధాలా కృషి చేస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ పనితీరు మెరుగవడం, డాగ్ స్క్వాడ్ సహాయంగా పని చేయడం, మినీ ప్రోక్లైనర్ వాడడం వంటి అంశాలు సహాయక చర్యలకు మరింత బలాన్నిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకుపోయిన 8 మంది జాడను గుర్తించేందుకు సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి ప్రమాదం జరిగి 13 రోజులు గడుస్తున్నా వారి జాడ కనుక్కోలేకపోవటంతో.. రంగంలోకి జాగిలాలలను దింపారు. కేరళ నుంచి ఆర్మీ హెలికాప్టర్లలో రెండు కేడవర్ డాగ్స్ని తీసుకువచ్చారు. కేరళ ప్రత్యేక పోలీసుు, జిల్లా కలెక్టర్ సంతోష్ కలిసి విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.