హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఈరోజు హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. సీఎం గాలి మాటలకు సమాధానం, సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో రేవంత్రెడ్డి నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఆ ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారు. ప్రజా తీర్పు.. కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టులాంటిది.

జీవో 317 కారణంగా ఇబ్బందులు
ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చాలి. రైతులకు ఎకరాకు రూ.15 వేలు, యువతకు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500, దళితులకు రూ.12 లక్షలు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని ఆ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. జీవో 317 కారణంగా ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
కుల గణనపై విమర్శలు
కాగా, బీసీ రిజర్వేషన్లపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి లేకనే కుల గణనపై విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. కుల గణనలో పాల్గొనాలని కేసీఆర్ ను, కేటీఆర్ను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు డిమాండ్ చేయడంలేదని నిలదీశారు. కుల గణనపై విమర్శలు చేసేవారు.. ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పాలన్నారు. బీసీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కిషన్ రెడ్డి కుల గణనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.