న్యూఢిల్లీ: దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. గత ఏడాదితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ ‘నైట్ ఫ్రాంక్’ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం మిలియనీర్ల సంఖ్య 85,698కు చేరుకొన్నట్టు వివరించింది. పది మిలియన్ డాలర్ల కంటే (రూ. 87 కోట్లు) ఎక్కువ సంపద కలిగి ఉన్నవారిని మిలియనీర్లుగా పిలుస్తారు. ఇదిలాఉండగా కుబేరులు ఎక్కువగా పశ్చిమ దేశాల్లోనే ఉంటారనుకొంటాం. అయితే, సంపన్నులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో టాప్-3లో భారత్ కూడా ఉన్నట్టు ‘నైట్ ఫ్రాంక్’ నివేదిక వెల్లడించింది. కనీసం రూ. 8,500 కోట్ల కంటే ఎక్కువ సంపద కలిగినవారిని బిలియనీర్లుగా పిలుస్తాం. కాగా ప్రపంచంలోని మొత్తం కుబేరుల సంపద విలువ ఏకంగా రూ.1,275 లక్షల కోట్లకు చేరింది.

రెండో స్థానంలో దేశరాజధాని ఢిల్లీ
దేశంలో 396 మంది కుబేరులతో ముంబై అగ్రస్థానంలో ఉండగా, 217 మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇక, 104 మంది సంపన్నులతో హైదరాబాద్ ముచ్చటగా మూడో స్థానాన్ని దక్కించుకొన్నట్టు హురున్ ఇండియా రిచ్లిస్ట్-2024 నివేదికలో వెల్లడించింది. మొత్తంగా తెలంగాణలో 109 మంది, ఏపీలో 9 మంది సంపన్నులు ఉన్నట్టు నివేదిక వివరించింది.
భారత్లో అత్యంత ధనిక కుటుంబాలు ఇవి..
అంబానీ కుటుంబం 10.09 లక్షల కోట్లు
మిస్త్రీ కుటుంబం 3.25 లక్షల కోట్లు
జిందాల్ కుటుంబం 2.43 లక్షల కోట్లు
బిర్లా కుటుంబం 1.99 లక్షల కోట్లు
నాలుగో స్థానంలో భారత్
హెచ్ఎన్డబ్ల్యూఐల విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా (9,05,413 మంది) అగ్రస్థానంలో, చైనా (4,71,634 మంది), జపాన్ (1,22,119 మంది) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే 3.7 శాతం మంది హెచ్ఎన్డబ్ల్యూఐలు భారత్లో ఉన్నారు. ‘ఎంట్రప్రెన్యూర్షిప్, కొత్త పరిశ్రమల దన్నుతో భారత్లో హెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య అసాధారణంగా వృద్ధి చెందుతోంది. దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ఆరి్థకంగా ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాలను దేశీయంగా పెరుగుతున్న సంపద సూచిస్తోంది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజల్ తెలిపారు.
అభిరుచులను బట్టి సంపన్నులు పెట్టుబడులు
రియల్ ఎస్టేట్ నుంచి గ్లోబల్ ఈక్విటీల వరకు సంపన్నుల పెట్టుబడుల ధోరణులు కూడా మారుతున్నాయి. ఇందుకు సంబంధించిన నైట్ ఫ్రాంక్ లగ్జరీ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ (కేఎఫ్ఎల్ఐఐ) ప్రకారం గతేడాది అయిదు సాధనాలకు మాత్రమే డిమాండ్ నెలకొంది. అభిరుచులను బట్టి సంపన్నులు పెట్టుబడులు పెట్టే 10 సాధనాలను (లగ్జరీ కలెక్టబుల్స్) ఈ సూచీ మదింపు చేస్తుంది. దీని ప్రకారం లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ల ధరలు 2.8 శాతం పెరగ్గా, ఆభరణాలు 2.3 శాతం, నాణేలు 2.1 శాతం, వాచీలు 1.7 శాతం, క్లాసిక్ కార్లు 1.2 శాతం పెరిగాయి. లగ్జరీ పెట్టుబడి సాధనంగా ఉండే ఆర్ట్ ధరలు అత్యధికంగా 18.3 శాతం పడిపోయాయి.