అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో ఒక సంచలనం. అవినీతికి వ్యతిరేకంగా జన్లోక్పాల్ వ్వవస్థను తీసుకురావాలని గాంధేయవాది అన్నా హజారే చేసిన దీక్షతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించారు కేజ్రీవాల్. మధ్యతరగతికి ప్రతిబింబంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. అన్నా హజారే ఉద్యమంతో ఎదిగి ఆ తర్వాత ఆప్ను నెలకొల్పి ఢిల్లీ గద్దెనెక్కారు. కామన్ మ్యాన్ ప్రోత్సాహంతో సింహాసనాన్ని అధిష్టించిన కేజ్రీవాల్, తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ మాజీ సీఎం దారుణ ఓటమిని మూటగట్టుకున్నారు.

మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రం. దేశం నలుమూలల నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ జనాల్లో చైతన్యం కూడా ఎక్కువే. అందుకే మార్పుకు శ్రీకారం చుడతారు, తమ జీవితాలు మారుస్తారనే నమ్మకంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కు మద్దతుగా నిలిచారు. కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఆప్ జాతీయ కన్వీనర్ పూర్తిగా విఫలమయ్యారు. అవినీతిని నిర్మూలిస్తారని అనుకుంటే అదే ఆరోపణలతో పరువు పోగొట్టుకున్నారు. లిక్కర్ స్కామ్తో ఏకంగా జైలుకు వెళ్లొచ్చారు. కేజ్రీవాల్తో పాటు ఆప్ ముఖ్య నేతలు మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ కూడా కటకటాల పాలయ్యారు. దీనికి తోడు ఢిల్లీ సీఎం అధికార నివాసానికి సుమారుగా రూ.33 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు కాగ్ నివేదికలో తేలింది. ఇవన్నీ చూసిన ప్రజలు తట్టుకోలేకపోయారు.మార్పు తీసుకొస్తారని భావిస్తే ఢిల్లీని మరింత అగాథంలోకి కేజ్రీవాల్ నెట్టేశారనే భావన ప్రజల్లో పెరిగిపోయింది. అవినీతిని అంతమొందిస్తాడని భావిస్తే అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిపోవడం, జైలు పాలవడం, గెలుపు కోసం సాధ్యం కాని అడ్డగోలు హామీలు ఇవ్వడం, విశ్వసనీయత కోల్పోవడం, లెఫ్టినెంట్ గవర్నర్తో వరుస వివాదాలు, యమునా నది ప్రక్షాళన చేయకపోవడం, వాతావరణ కాలుష్యం పెరగడం లాంటివన్నీ కేజ్రీవాల్ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా చేశాయి. దీంతో ఇన్నాళ్లూ ఆప్కు సపోర్ట్గా ఉన్న మధ్యతరగతి ప్రజలు ఒక్కసారిగా రివర్స్ అయ్యారు.