హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్కుమార్ను కోరారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రణాళికా శాఖ ఆదివారం బీసీ మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాలులో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో సబ్కమిటీ సమర్పించనుంది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ కూడా తమ నివేదికను ఉపసంఘానికి సోమవారం అందించింది. ఈ రెండు నివేదికలపై క్యాబినెట్ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు.
కాగా, కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టనుంది ప్రభుత్వం. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో నివేదికకు ఆమోదం లభించినట్లు సమాచారం. అయితే ఆ భేటీ కొనసాగుతుండడంతో.. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభను వాయిదా వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ను కోరారు. దీంతో మధ్యాహ్నాం 2గం. దాకా సమావేశాలు వాయిదా పడ్డాయి.