తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. రేషన్ కార్డుల దరఖాస్తుల కు వస్తున్న స్పందనతో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని నిర్ణయించింది. తాజా సభల్లో ఇచ్చే దరఖాస్తులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. ఇక, ఇదే సమయంలో హైదరాబాద్ లో మాత్రం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

పెరుగుతున్న దరఖాస్తులు
పెరుగుతున్న దరఖాస్తులు అయితే, ప్రజాపాలన సభలు, మీసేవా కేంద్రాలకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొని అర్హులని గుర్తిస్తామని మంత్రులు చెబుతున్నారు. అర్హుల పరిశీలన సమయాన్ని పొడిగించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం ముందుగా ఈ నెల 24వ తేదీ వరకు గ్రామ, బస్తీ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు మరో రోజు మాత్రమే గడువు ఉంది. రేషన్ కార్డులకు పథకాలను అనుసంధానం చేస్తుండటంతో దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ లో మాత్రం సభలు ప్రారంభం కాలేదు. దీంతో.. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ నుంచి హైదరాబాద్ లో మొదలు అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. కొంత ఆలస్యం అయినా అర్హులు అందరికీ రేషన్ కార్డులు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా ఈ నెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల కోసం తుది కసరత్తు జరగనుంది. ఆ నాలుగు పథకాల అమలు లో భాగంగా దరఖాస్తులను ప్రస్తుత గ్రామ, బస్తీ సభల్లో పరిశీలన చేస్తున్నారు.