పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ కమ్ ఆస్పత్రిలో 31 ఏళ్ల డ్యూటీ డాక్టర్ పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో సీల్దా కోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన దోషిగా నిర్ధారించిన సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసును దర్యాప్తు చేసిన సీబీఐ .. నిందితుడు సంజయ్ రాయ్ ను దోషిగా నిరూపించడంలో సక్సెస్ అయింది. అంతకు ముందు ఈ కేసును సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమగ్రంగా దర్యాప్తు చేసిన సీబీఐ.. నిందితుడు సంజయ్ రాయ్ ని దోషిగా నిరూపించింది. దీంతో అతనికి ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరింది. మరోవైపు తాను నేరానికి పాల్పడలేదని సంజయ్రాయ్ కోర్టుకు చెప్పుకున్నాడు. తనను కావాలనే కేసులో ఇరికించారని తెలిపాడు. నేరానికి పాల్పడినట్టు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి చేశారన్నాడు. తనకు ఉరికి బదులు ప్రత్యామ్నాయ శిక్షవిధించాలని కోర్టును సంజయ్రాయ్ కోరాడు.

ఇరు వర్గాల వాదనలు విన్న సీల్దాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శనివారమే సంజయ్ రాయ్ ను దోషిగా నిర్ధారించడంతో పాటు కనిష్టంగా జీవిత ఖైదు, గరిష్టంగా ఉరిశిక్ష విధిస్తామని కూడా తెలిపింది. అయితే ఇవాళ తీర్పులో మాత్రం అతనికి జీవిత ఖైదు విధించింది. అలాగే 50 వేల జరిమానా కూడా విధించింది. మరోవైపు ఈ కేసు అత్యంత అరుదైన కేసు కాదని జడ్జి అనిర్బన్ దాస్ వ్యాఖ్యానించారు. అందుకే జీవిత ఖైదుతో సరిపెడుతున్నట్లు తీర్పులో తెలిపారు. ఈ కేసులో దోషిగా ఉరిశిక్ష పడుతుందని అంచనా వేసిన మృతురాలి తల్లితండ్రులు కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని జస్టిస్ అనిర్బన్ దాస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమకు నష్టపరిహారం వద్దని, న్యాయం చేయాలని కోర్టు హాలులో బాధితురాలి తల్లిదండ్రులు కోరారు.