భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవా సుబియాంటో ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా గురువారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఇండోనేషియా అధ్యక్షుడు రిపబ్లిక్ వేడుకలకు హాజరవుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఇండియాలో ఇండోనేషియా ప్రెసిడెంట్ జనవరి 25, 26 తేదీల్లో పర్యటించనున్నారు. 2024 అక్టోబర్లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ పర్యటన రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు దోహద పడుతుందని తెలిపింది.

కాగా 1950 నుంచి భారత్ తన మిత్ర దేశాల అధినేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. 1952, 53, 66ల్లో మాత్రమే విదేశీ అథితులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. 2024లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ముథ్య అతిథిగా రాగా.. 2023లో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా ఎస్-సిసిని అతిథిగా వచ్చారు. 2021, 2022 సంవత్సరాల్లో కరోనా కారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు అతిథులను ఆహ్వానించలేదు.