న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం విజిటర్ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్ ఇమిగ్రంట్ వీసాలను అమెరికా భారత్కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత 2024లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులను అమెరికాకు పంపించిన ఘనత భారత్ దక్కించుకున్నట్టు భారత్లోని అమెరికన్ ఎంబసీ శుక్రవారం ప్రకటించింది. వరుసగా రెండేళ్లు అత్యధిక సంఖ్యలో అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ విద్యార్థులను అమెరికాకు పంపిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని అమెరికన్ మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
గడచిన నాలుగేళ్లుగా అమెరికాకు అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది అమెరికాలో ఉంటూనే హెచ్1-బీ వీసా రెన్యువల్ చేసుకునేందుకు ఒక పైలట్ కార్యక్రమాన్ని విజయవంతంగా తమ విదేశాంగ శాఖ అమలు చేసిందని ఎంబసీ తెలిపింది. దీని వల్ల దేశాన్ని వీడకుండానే తమ వీసాలను రెన్యువల్ చేసుకునే అవకాశం భారతీయ ప్రత్యేక వృత్తి నిపుణులకు లభిస్తుందని పేర్కొన్నది.
విద్య.. వ్యాపారం.. పర్యాటకంకోసం అమెరికాకు వచ్చే భారతీయుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని పేర్కొన్న కాన్సులేట్.. గడిచిన నాలుగేళ్లలో దాదాపు ఐదు రెట్లు పెరిగినట్లుగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు దాదాపు 20 లక్షల మంది భారతీయులు అమెరికా ప్రయాణాలు చేశారని.. 2023తో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువగా పేర్కొంది.
అంతేకాదు మరో 50 లక్షల మంది యూఎస్ ను సందర్శించేందుకు వలసేతర వీసాలు పొంది ఉన్నట్లుగా చెప్పింది. రోజూ వేల సంఖ్యలో కొత్త వీసాలు జారీ అవుతున్నాయని.. ఈ ఏడాది అమెరికాలోనే హెచ్ 1 బీ వీసాలు రెన్యువల్ చేసే ప్రయోగాత్మక కార్యక్రమాన్ని డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్ విజయవంతంగా అమలు చేసినట్లుగా వెల్లడించింది. ఇక.. అమెరికాలో నివసిస్తూ.. భారత్ కు వచ్చిన భారత అమెరికన్ పౌరుల్లో 24 వేల మందికి పైనే వీసాలు జారీ చేసినట్లుగా వెల్లడించింది.