అమరావతి: ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం రేషన్ బియ్యం విషయంలో ఆర్గనైజ్డ్ మాఫియాను తయారుచేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో 76,854 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేస్తే….. కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే 60 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసిందని చెప్పారు. అంతేకాకుండా వారిపై క్రిమినల్ కేసులతో పాటు పీడీ యాక్ట్ ఉపయోగించడం జరిగిందని తెలిపారు.

వీరిపై క్రిమినల్ కేసులు నమోదు
రాష్ట్రంలో 2019-2024 మధ్య పౌరసరఫరాల దాడులలో 76,854 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,664 మంది. ఇందులో 148 మందిని రెండుసార్లు కంటే ఎక్కువ పర్యాయాలు అరెస్ట్ చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయి. బియ్యంతో పాటు 512 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కాకినాడలో 50 వేల మెట్రిక్ టన్నులు బియ్యం జప్తు చేశారు. ఇందులో 25 వేల 386 మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యంగా గుర్తించారు. 13 సంస్థలపై కేసు నమోదైంది. క్షేత్రస్థాయిలో ఇప్పటికీ రేషన్ బియ్యం కోసం ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు అందిస్తాం” అని నాదెండ్ల వివరించారు.