హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోఠిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రూ.550 కోట్ల విలువైన నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్న రాజీవ్గాంధీ కలల్ని.. మహిళా వర్సిటీ విద్యార్థులు నిజం చేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందని, అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధిని నిరూపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.

ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని
ఈ యూనివర్సిటీలో చదువుకోవడం ఇక్కడి విద్యార్థుల అదృష్టమని, మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేస్తున్నానన్న సీఎం రేవంత్ రెడ్డి.. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించామని వివరించారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని.. వారు వ్యాపారవేత్తలుగా రాణిస్తారన్న భావనతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నామని తెలిపారు. అంతకుముందు విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్ను సీఎం సందర్శించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ఉన్నతాధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.