న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో నిర్వహించబోతున్నారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత పెద్ద ఎత్తున వరాల జల్లు కురిపిస్తున్నారు. ఇటీవలే మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రకటించిన కేజ్రీవాల్ తాజాగా ఆలయ అర్చకుల కోసం మరో పథకాన్ని తీసుకు వస్తున్నట్లు వివరించారు. ఆలయాలతో పాటు గురుద్వారాల్లో పని చేసే పూజారులు, గ్రంథీలకు నెల నెలా జీతభత్యాలు ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే నెలకు 18 వేల చొప్పున గౌరవ వేతనం ఇవ్వబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తాను ఈరోజు ఒక కొత్త పథకానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేస్తున్నట్లు వివరించారు. ఆ పథకం పేరు పూజారి గ్రంథి సమ్మాన్ యోజన అని తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఆలయాల పూజారులకు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు. ముఖ్యంగా పురోహితులతో పాటు గ్రంథీలకు నెలకు రూ. 18,000 గౌరవ వేతనం అందజేయబోతున్నట్లు స్పష్టం చేశారు.
అయితే ఈ పథకం రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పథకాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి కుట్రలు చేయొద్దని బీజేపీని కోరారు. అలాగే మన ఆచార, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందజేయడం కోసం పురోహితులు, గ్రంథీలు చాలా కష్టపడుతున్నారని అరవింద్ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అలాంటి వారి కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం ఏ ఒక్కరూ ఆర్థిక సాయం చేయలేదని.. అందుకే తాము ఈ పథకం తీసుకు వచ్చినట్లు వివరించారు.