Lokesh: ఏపీ కి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు(శుక్రవారం) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను అఖిల్ ఆకెళ్ల కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్తో సమావేశమయ్యారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్.. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు.
టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్
ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని మంత్రి అన్నారు.
కోడింగ్ నైపుణ్యాలతో ఆరు మైక్రోసాఫ్ట్ ఐటీ సర్టిఫికేట్లు
కాగా, కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సమయంలో అఖిల్ ఆకెళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కోడింగ్ నైపుణ్యాలతో ఆరు మైక్రోసాఫ్ట్ ఐటీ సర్టిఫికేట్లు సాధించుకున్నాడు. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా ఏఐ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఎక్కువ ఉన్న అఖిల్ ఆకెళ్ల.. 2025లో జరిగే టెక్ షోలో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కొవిడ్ లాక్డౌన్ సమయంలో పిల్లల కోసం స్క్రాచ్ పేరుతో ఉచిత కోడింగ్ ప్లాట్ఫామ్ రూపొందించారు. సొంతంగా ఆన్లైన్ గేమ్స్ తయారు చేసుకోవడంతో పాటుగా యానిమేషన్ల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తుంటాడు.