Delhi budget : ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేఖాగుప్తా పేర్కొన్నారు. అయితే త్వరలో ప్రవేశపెట్టనున్న వికసిత్ ఢిల్లీ బడ్జెట్ విషయంలో ప్రజల నుంచి 10 వేల సూచనలు అందినట్లు రేఖాగుప్తా వెల్లడించారు. ఇందులో మహిళల ఆర్థిక సాధికారత, విద్య, ఆరోగ్యం, యమునా నది ప్రక్షాళన, కాలుష్యం వంటివాటికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ‘ఖీర్’ వేడుకతో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దేశరాజధానిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 24 నుంచి 28 వరకు జరగనున్నాయి. మార్చి 25న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.

మెయిల్ ద్వారా 3,303 సూచనలు
బడ్జెట్ను సిద్ధం చేసే ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు తమ ప్రభుత్వం నిపుణులతో సహా సమాజంలోని వివిధ వర్గాలను సంప్రదించిందని రేఖా గుప్త తెలిపారు. ప్రజల నుంచి మెయిల్ ద్వారా 3,303 సూచనలు రాగా.. వాట్సప్ ద్వారా 6,982 సూచనలు వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిగణలోకి తీసుకొని బడ్జెట్ను రూపొందిస్తామని అన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను, ఉపాధి కల్పనను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దిల్లీని అభివృద్ధి బాటలో నడుపుతుందని పేర్కొన్నారు.