పుష్ప 2 వసూళ్ల పరంగా రికార్డులు తిరగరాస్తున్నా, ఈ చిత్ర బృందం ఆనందం ఆస్వాదించే స్థితిలో లేదు.ఈ సినిమా ఇప్పటికే రూ. 1600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణంగా చిత్ర బృందం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పుష్ప 2 ప్రీమియర్ షోల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఒక చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరాడు. ఈ ఘటన తర్వాత హీరో అల్లు అర్జున్ అనుకోకుండా వివాదాల కేంద్రమయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం,బీఆర్ఎస్, బీజేపీ నేతల నుంచి కఠిన విమర్శలు రావడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.ఈ వివాదాలు సినిమా పరిశ్రమను కుదిపేస్తుండగా, పుష్ప 2 సక్సెస్ పైన ఈ సమస్య మబ్బులా కమ్మేసింది.ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్గా మారాయి.
అమెరికాలో ఇటీవల జరిగిన రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్లో‘ధోప్’అనే లిరిక్ సాంగ్ను విడుదల చేశారు.‘ధోప్’ అంటే వదిలేయడం అని అర్థం.ఈ నేపధ్యంలో యాంకర్ సుమ సుకుమార్ను ఉద్దేశిస్తూ,“మీరు ఈ రోజు ఏం వదిలేయాలనుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, సుకుమార్ అనుకోని మాట చెప్పారు.“సినిమాలను వదిలేయాలని అనిపిస్తోంది”అని ఆయన స్పందించారు.ఈ వ్యాఖ్యతో పక్కనే ఉన్న రామ్ చరణ్ షాక్ అయ్యాడు.సుకుమార్ని తలతిప్పి చూస్తూ, “అలా చేయరులే!” అనే సైగ చేశాడు. ఈ సంఘటనపై అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బహుశా ప్రస్తుత వివాదాల వల్ల సుకుమార్ భావోద్వేగానికి లోనై ఇలా మాట్లాడి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు.సుకుమార్ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. పుష్ప 2 బృందం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు దర్శకుడి భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిమానులు భావిస్తున్నారు.