ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో ఇటీవల రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీతో పాటు మరెన్నో ప్రముఖులు హాజరయ్యారు. అయితే,అందరి దృష్టిని ఆకర్షించినది వినోద్ కాంబ్లీ స్థితి. వీల్చైర్లో కూర్చొన్న ఆయనను చూసి చాలా మందికి షాక్ అయింది.ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మరియు పలు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అంతేకాకుండా, కాంబ్లీ మెదడులో రక్తం గడ్డకట్టినట్లు కూడా వైద్యులు వెల్లడించారు.అయితే, కాంబ్లీ పూర్తిగా చికిత్సకు సహకరిస్తున్నారని వారు చెప్పారు.ఈ సమయంలో,భారత క్రికెట్కు చేసిన కాంబ్లీ సేవలకు గౌరవంగా ఆకృతి ఆస్పత్రి ఆయనకు జీవితాంతం ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది.ఈ నిర్ణయాన్ని కాంబ్లీ కుటుంబం, అలాగే ఆయన అభిమానులు ఆనందంతో స్వీకరించారు.
ఆసుపత్రి ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్.సింగ్, “కాంబ్లీ వైద్య ఖర్చులన్నింటినీ ఆసుపత్రి చూసుకుంటుంది. ఇకపై ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు” అని చెప్పారు. వినోద్ కాంబ్లీ తన చికిత్స గురించి మాట్లాడుతూ,”వైద్యుల సూచనలు నేను తప్పకుండా పాటిస్తాను. ఈ వైద్యుల కృషి వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను” అని ఆయన భావోద్వేగంగా చెప్పారు.వైద్య బృందం తన పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.ఈ చర్య కాంబ్లీ అభిమానులను ఎంతో ఆనందానికి గురిచేసింది. ఆయనకు జీవితాంతం ఉచిత వైద్య సేవలు అందించడం, ఆయన చేసిన సేవలకు గౌరవార్థం ఒక గొప్ప నిర్ణయమే. కాంబ్లీ ఈ చికిత్సతో త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.