రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య చోటుచేసుకున్న చిన్న గొడవ ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఈ సంఘటన డిసెంబర్ 12న రాత్రి బగ్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంసింగ్పురా గ్రామంలో జరిగింది. బెగుసరాయ్ రోడ్డులోని ఒక నిర్జన ప్రదేశంలో కొందరు యువకులు కలిసి ఉన్నారు. వారి మధ్య ఉన్న గొడవ క్రమంగా తీవ్రస్థాయికి చేరింది. ఆ సమయంలో ఇద్దరు యువకులు తమ స్నేహితుడు రాకేష్ గుర్జార్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో కాలుతున్న రాకేష్ కేకలు వేయడం గమనించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే రాకేష్ తీవ్రంగా కాలిపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రాకేష్ను ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ రాకేష్ మరణించాడు. ఘటనా స్థలానికి డీసీపీ అమిత్ బుదానియా, ఏసీపీ హేమేంద్ర శర్మ, బగ్రు పోలీస్ అధికారి మోతీలాల్ శర్మ చేరుకుని విచారణ చేపట్టారు.
మృతుడు రాకేష్ తండ్రి మోహర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాకేష్ను గురువారం మధ్యాహ్నం స్నేహితులు మనోజ్ కుమావత్, హరిమోహన్ మీనా ఇంటి నుంచి తీసుకెళ్లారని, సాయంత్రం అతడిపై పెట్రోల్ పోసి కాల్చేశారని ఆరోపించారు.రాకేష్ చివరిగా ఇచ్చిన ప్రకటన ఆధారంగా, ఈ ఘటనను నిందితులలో ఒకరు వీడియో తీశారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఆ వీడియోలో, “మనోజ్, హరిమోహన్ కలిసి నాపై దాడి చేశారు” అని రాకేష్ స్పష్టం చేశాడు.పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.అయితే ఇప్పటివరకు అధికారికంగా పూర్తి సమాచారం వెల్లడి కాలేదు.మృతుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.నిందితులను త్వరగా అరెస్టు చేసి దర్యాప్తు పూర్తిచేసి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ దారుణ సంఘటన స్నేహితుల మధ్య ఉన్న చిన్న గొడవలు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో సూచిస్తోంది.