తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మహిళలు ఊరూరా తిరుగుతూ.. చేపల్ని వాహనాల్లో అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం సంచార చేపల అమ్మకం వాహనాల్ని రెడీ చేసింది. ఇవి మొత్తం 32 వాహనాలు ఉన్నాయి. జిల్లాకి ఒకటి ఉన్నాయి. ఒక్కో వాహనం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం.. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య పథకంతో లింక్ చేసింది. అందువల్ల ఒక్కో వాహనాన్నీ 4 లక్షల రూపాయలకు ఇస్తోంది. మిగతా రూ.6 లక్షలు చెల్లించాల్సిన పనిలేదు. ఇది మహిళలకు మంచి ప్రయోజనం. మంత్రి సీతక్క దీన్ని దగ్గరుండి చూస్తున్నారు.

ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే.. ఆ రాష్ట్రంలో మహిళలు సాధికారత సాధించాలి. వాళ్లు తమ కాళ్లపై తాము నిలబడాలి. వారి చేతికి డబ్బు రావాలి. అప్పుడు వారు ఆ డబ్బును పొదుపుగా, జాగ్రత్తగా ఉపయోగిస్తారు. తమ ద్వారా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్ములా. దీన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బాగా వంటబట్టించుకుంది. అందుకే మహిళల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంది. తాజాగా పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇచ్చిన ఆదేశాలు సంచలనంగా మారాయి.