దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో జరిగిన అక్రమ తవ్వకాల వల్ల అనేకులు మరణించారు. చనిపోయిన వారి మృత దేహాలను వెలికి తీసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఈ గనిలోంచి 78 మంది కార్మికుల మృత దేహాలను వలంటీర్లు బయటికి తీసుకొచ్చారు. మరో 200 మందిని కాపాడారు. గతేడాది కొంతమంది గని కార్మికులు ఎలాంటి అనుమతి లేకుండా ఉద్దేశపూర్వకంగా స్టిల్ఫొంటైన్ గనిలోకి ప్రవేశించారు. వారి విషయంలో కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు వారికి ఆహారం, నీటి సరఫరాను నిలిపివేశారు. అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అనేక మంది కొన్ని నెలల తరబడి ఈ గని లోపలే నివసిస్తున్నారని కథనాలు వచ్చాయి. అంతకుముందు ఈ గనిలో ఉన్న భయంకరమైన పరిస్థితిని చూపించే వీడియోలు ఆందోళన కలిగించాయి.

గతేడాది దేశవ్యాప్తంగా అక్రమ మైనింగ్కు వ్యతిరేకంగా పోలీసులు ఆపరేషన్ మొదలు పెట్టినప్పటి నుంచి వారు అక్కడే ఉంటున్నారు. ఇటీవల బయటకు వచ్చిన వీడియోల్లోని ఒక దాంట్లో గని లోపల మృతదేహాలను కవర్లలో చుట్టినట్లు కనిపించింది. అయితే ఈ వీడియోను బీబీసీ స్వతంత్రంగా వెరిఫై చేయలేదు. మరో వీడియోలో బక్కచిక్కిన శరీరాలతో కొంతమంది అక్కడ తిరుగుతున్న దృశ్యాలున్నాయి. గనిలో ఉన్న వారిని రక్షించాలని కోర్టు వారం రోజుల క్రితం ఆదేశించడంతో చాలా ఆలస్యంగా సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ఈ సహాయక చర్యలు ప్రారంభించకముందే 1,500 మందికి పైగా కార్మికులు గని నుంచి బయటికి వచ్చారని పోలీసులు చెప్పారు.
దక్షిణాఫ్రికాలో అక్రమంగా గనులు తవ్వేవారిని ‘జామాజామా’ అంటారు. ఈ కార్మికుల మీద ప్రభుత్వం చర్యలు ప్రారంభించిన తర్వాత వంద మందికిపైగా మరణించినట్లు కథనాలు వచ్చాయి. ఈ గని జోహెన్నెస్బర్గ్కు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది.అయితే మృతుల సంఖ్యను అధికారులు అధికారికంగా ప్రకటించడంలేదని, ఎంతమంది చనిపోయారో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.