హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన వేడుకలలో మహా కుంభమేళా ఒకటి.ప్రపంచంలోని నలుమూలల హిందువులు ఈ మహా పర్వంలో పాల్గొనడం ఎంతో పవిత్రమైన అనుభూతిగా భావిస్తారు.2024 జనవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో ఈ మహా కుంభమేళా ప్రారంభం కానుంది.ఫిబ్రవరి 26 వరకు, 45 రోజుల పాటు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో, యోగి సర్కార్ భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు సజావుగా జరగేలా చూస్తోంది.ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరొక విశేషం అయోధ్య రామమందిరం.రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారిగా కుంభమేళా జరగబోతుండటంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ మందిర దర్శన వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళా భద్రత కోసం భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు.

పారా మిలిటరీ బలగాలు, 50 వేల మంది భద్రతా సిబ్బందితో పాటు, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన 2700 కెమెరాలు నిఘాను అమలు చేస్తున్నారు.ఈసారి తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.భక్తుల సౌకర్యార్థం మహా కుంభ్ నగర్ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. వసతి కోసం వేల సంఖ్యలో టెంట్లు,షెల్టర్లు అందుబాటులో ఉంచారు. ఈ మహానగరాన్ని గూగుల్ మ్యాప్తో అనుసంధానించి, భక్తులకు లోకేషన్ సమాచారం అందిస్తున్నారు. ఇంకా, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసి, అత్యవసర చికిత్స కోసం ఒకేసారి 200 మందికి సేవలు అందించగల బీష్మ క్యూబ్లను ఏర్పాటు చేస్తున్నారు.భక్తుల సందేహాలను నివృత్తి చేయడం కోసం 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కుంభమేళా గురించి మరింత సులభంగా సమాచారం అందుబాటులో ఉంటుంది.