ఫెంగల్ తుపాను దెబ్బకు హైదరాబాద్ నుంచి విమానాలు రద్దయ్యాయి. ఫెయింజల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నై వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో చెన్నై ఎయిర్ పోర్టును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ లైన్స్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇటు హైదరాబాద్ నుంచి నడవాల్సిన విమానాలు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లాల్సిన ఏడు విమానాలతో పాటు తిరుపతి నుంచి హైదరాబాద్ విమానాలను రద్దు చేశారు. అలాగే, ఏపీ తిరుపతిలోనూ విమానాల రాకపోకలపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రతికూల వాతావరణం వల్ల దాదాపు పది విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ముంబై, త్రిపుర వెళ్లే విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను అత్యంత నెమ్మదిగా కదులుతున్నదని.. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లుగా పేర్కొంది. పూర్తిగా తీరం పైకి వచ్చి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని.. రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అల్పపీడనం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి. మీ వేగంతో గాలులు వీస్తాయి. మధ్యలో గంటకు 75 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించింది. తుపాను నేపథ్యంలో, ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిరంతరం ఏపీ సర్కార్కు నిరంతరం సంకేతాలను అందిస్తోంది. ఇండియాకు చెందిన ఇన్సాట్-3డీఆర్, ఈవోఎస్ -06 శాటిలైట్ల ద్వారా ఎప్పటికప్పుడు పెంగల్ తుపాను స్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్రో అందిస్తోంది. దీంతో విపత్తుల కట్టడికి ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఎంతో దోహదపడుతుంది. ఉపగ్రహాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇస్రో, ఏపీ గవర్నమెంట్ను అలర్ట్ చేయగా వారు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.