న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ దాఖలుకు ముందు కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని కేజ్రీవాల్ సందర్శించారు. భార్య సునీతతో కలిసి ఆలయానికి చేరుకున్న కేజ్రీవాల్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు వరకూ ర్యాలీగా బయల్దేరనున్నారు. అక్కడ నామినేషన్ దాఖలు చేస్తారు. కాగా ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు.
కాగా, ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. మద్యం పాలసీలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణ చేపట్టేందుకు ఈడీకి కేంద్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, తర్వాత కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి పొందింది ఈడీ. దీంతో కేజ్రీవాల్ను వివాదాస్పద మద్యం పాలసీపై విచారించేందుకు ఈడీకి ఉన్న అడ్డంకులు తొలగిపోయనట్లయింది. అలాగే ఆప్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈడీ త్వరలోనే విచారించే అవకాశముంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమ నగదు చలామణీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ గతేడాది మార్చి 21న అప్పటి సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. తర్వాత సీబీఐ కూడా కేసు నమోదు చేసి గతేడాది జూన్లో అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో ఆప్ ముఖ్యనేత, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరంతా బెయిలుపై విడుదలయ్యారు.
గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయటకొచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి పూర్తి పార్టీ కార్యకలాపాలపైనే దృష్టి పెట్టారు. ఎలాగైనా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. మరో మూడు వారాల్లో పోలింగ్ జరగనుండగా.. ఈ తరుణంలో మద్యం కేసులో కేజ్రీవాల్కు ఈడీ ఉచ్చు బిగిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ 70 శాసనసభ సీట్లకు గాను ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.