న్యూఢిల్లీ: తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇరువురి మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించింది. లేనిపక్షంలో తాము జోక్యం చేసుకుని పరిష్కరిస్తామని పేర్కొంది. తమిళనాడులోని విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ల (వీసీ) నియామకంపై సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతున్నది. గవర్నర్ వీసీగా వ్యహరించే అధికారాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీనితో పాటు పలు నియామకాల్లో గవర్నర్ అధికారాలను పరిమితం చేసింది. అయితే ఈ బిల్లులను ఆమోదించడానికి ఆర్ఎన్ రవి నిరాకరించారు.

కాగా, మద్రాస్ విశ్వవిద్యాలయం, భారతియార్ విశ్వవిద్యాలయం, తమిళనాడు ఉపాధ్యాయ శిక్షణ విశ్వవిద్యాలయాలకు వైస్-ఛాన్సలర్లను నియమించడానికి గవర్నర్ రవి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్య చట్టవిరుద్ధమని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది.
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి సభ్యులను తొలగించడంతోపాటు ఆ కమిటీని పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్బీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ఇరువురు కలిసి బిల్లుల పెండింగ్ వివాదాన్ని పరిష్కరించుకోవడం మంచిదని సూచించింది. లేనిపక్షంతో ఈ సమస్యను తాము పరిష్కరిస్తామని కోర్టు హెచ్చరించింది.