ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని కాన్వాయ్పై దాడి జరిగిందని ఆ పార్టీ ఆరోపించింది. ఈ ఘటన శనివారం నాడు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఆప్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. బీజేపీ ఈ ఘటనకు సంబంధించి కేజ్రీవాల్ వాహనం ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టిందని పేర్కొంది. ఆప్ పార్టీ వాదన ప్రకారం, ఈ దాడి తాము చేపట్టే ప్రచారానికి ఆటంకం కలిగించేందుకు బీజేపీ చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నం అని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన వీడియోలో కేజ్రీవాల్ వాహనంపై ఒక రాయి పడినట్లు కనిపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
బీజేపీ నేత పర్వేష్ వర్మ ఈ సంఘటనపై స్పందిస్తూ, కేజ్రీవాల్ తన వాహనంతో ఇద్దరు యువకులను ఢీకొట్టారని తెలిపారు. బాధితులను లేడీ హార్డింగ్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై వారు మాట్లాడుతూ, “మీరు ప్రజల జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వడం మర్చిపోయారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్పై దాడి ఆరోపణలపై ఆప్ నాయకుడు మనీష్ సిసోడియా కూడా స్పందించారు, ఆప్ చీఫ్ను లక్ష్యంగా చేసుకోవడానికి బిజెపి గూండాలను పంపుతోందని ఆరోపించారు. “అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్న సమయంలో బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ గూండాలు ఆయనపై రాళ్లతో దాడి చేశారు. మీ పిరికిపంద దాడికి కేజ్రీవాల్ భయపడరు, ఢిల్లీ ప్రజలు మీకు తగిన సమాధానం ఇస్తారు “అని ఆప్ ట్వీట్ చేసింది.
ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు వీడియోలను ఆప్ పార్టీ విడుదల చేసిన తర్వాత, ఢిల్లీ పోలీసులు మాత్రం దాడి జరగలేదని స్పష్టం చేశారు. లాల్ బహదూర్ సదనంలో అరవింద్ కేజ్రీవాల్ బహిరంగ సభ నిర్వహిస్తుండగా, కొంతమంది బీజేపీ కార్యకర్తలు ప్రశ్నలు అడగాలనుకున్నారు. దీని తర్వాత రెండు వర్గాలు నినాదాలు చేయడం ప్రారంభించాయి, దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థుతిని నియంత్రించారు. ఫిబ్రవరి 5న జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో న్యూ ఢిల్లీ నియోజకవర్గం కీలకమైన యుద్ధభూమిగా మారింది. కేజ్రీవాల్ ఈ నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా, బీజేపీ నేత పర్వేష్ వర్మ, కాంగ్రెస్ నుండి సందీప్ దీక్షిత్ కూడా పోటీ చేస్తున్నారు.