అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఈ వైల్డ్ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా పేరొందిన లాస్ ఏంజెల్స్ మరభూమిని తలపిస్తోంది. ఖరీదైన ఇళ్లు, కార్లు, విలువైన సామగ్రి మంటల్లో కాలిబూడిదవుతున్నాయి. చాలా మంది ధనవంతులు, సెలబ్రిటీలు తమ సామాన్లు, కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకుజీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ విపత్తును కొందరు అవకాశంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుండటం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది.
బిలియనీర్లు, హాలీవుడ్ స్టార్స్ వదిలేసి వెళ్లిన ఇళ్లను దోపిడీ దొంగలు దోచుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక పోలీసులకు ఇది ఓ సవాల్గా మారింది. కార్చిచ్చు కారణంగా జనాలను రక్షించడంతోపాటు ఇటు దొంగతనాలను అరికట్టాల్సి రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకూ దొంగతనాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్ చేశారు. అందులోని ఓ వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారందరినీ అరెస్ట్ చేశారు.

24కు పెరిగిన కార్చిచ్చు మృతులు
వేగంగా వీస్తున్న గాలులతో మంటలు కొత్త ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో వేలాది ఇండ్లు కాలి బూడిదవుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ప్రాణనష్టం సైతం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. కార్చిచ్చులో మరణించిన వారి సంఖ్య 24కు పెరిగింది. మరణించిన వారిలో అత్యధికంగా ఏటోన్ ఫైర్లోనే 16 మంది కాగా, పాలిసేడ్స్లో 8 మంది ఉన్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.