కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ వెనక్కి
హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో జరుగుతున్నది. భేటీలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలపై కార్యక్రమాల నిర్వహణపై, సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరి అంశాలపై నేతలతో కేసీఆర్ చర్చించి.. శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానాన్ని పార్టీ నేతలకు గుర్తు చేశారు.

ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు
తెలంగాణలో మళ్లీ వందశాతం అధికారంలోకి వస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని వివరించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. ప్రజల కోసం పోరాటం చేయాలని శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసునన్నారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
అంతేకాక.. ఈ సమావేశంలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీల ఇంఛార్జి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు వ్యూహ రచనపై చర్చించినట్లు తెలుస్తోంది.