అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన దిగుమతి సుంకాల (టారిఫ్స్) విధానం పై ఆర్థిక నిపుణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నిర్ణయాన్ని “సెల్ఫ్ గోల్”గా అభివర్ణించారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు స్వీయంగా నష్టం చేసే చర్య అని అన్నారు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను దెబ్బతీసే ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

భారతకు వ్యూహాత్మక అవకాశాలు
అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ నేపథ్యంలో, భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే అనేక అవకాశాలు లభించవచ్చని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. చైనా నుంచి వ్యాపార కార్యకలాపాలు వేరుచేసుకోవాలని భావిస్తున్న అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని భారత ప్రభుత్వం కల్పించాలన్నారు. ఇందుకోసం సరైన విధానాలను అమలు చేయాలని సూచించారు.
వాణిజ్య సంబంధాలపై దృష్టి పెట్టాలి
ఈ సందర్భంగా రఘురామ్ రాజన్ మాట్లాడుతూ, “చైనా, అమెరికా, జపాన్ వంటి ప్రధాన దేశాలతో భారత్ చర్చలు జరపాలి. బహుళపక్ష వాణిజ్య ఒప్పందాల్లో చురుకుగా పాల్గొనాలి. వ్యాపార మార్గాల్లో సహకారం పెంచుకోవాలి. దీని ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, దేశీయ పరిశ్రమలకు నూతన అవకాశాలు కల్పించవచ్చు” అని వివరించారు.
దిగుమతులపై టారిఫ్ తగ్గింపు అవసరం
విదేశీ కంపెనీలను ఆకర్షించేందుకు దిగుమతులపై టారిఫ్లను తగ్గించడం అవసరమని రాజన్ సూచించారు. అధిక టారిఫ్లు దేశీయ తయారీకి శ్రేయస్కరం కాదని, అవి చివరికి వినియోగదారులపై భారం మోపుతాయని అన్నారు. తక్కువ దిగుమతి సుంకాల కారణంగా పోటీ వాతావరణం ఏర్పడి, భారత పరిశ్రమలు తాము తక్కువ ధరలకు, నాణ్యమైన ఉత్పత్తులు చేయడానికి ప్రోత్సహితమవుతాయని పేర్కొన్నారు. ఇది దేశీయ ఆర్థిక వృద్ధికి ఊతమిస్తుందని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు.