తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సందిగ్ధత నెలకొంది. ఈ నెల 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. లిస్టు ఫైనల్ అయినట్లు పార్టీ ముఖ్య నేతల్లో చర్చ జరిగింది. నలుగురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఢిల్లీ కేంద్రంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మంత్రుల లిస్టులో పార్టీ అగ్రనేత రాహుల్ ట్విస్ట్ ఇచ్చారు. కొందరి పేర్ల పైన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో, పార్టీ నేతలు కొత్త జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. మరో ఇద్దరు పేర్లు తెర మీదకు వస్తున్నాయి.
విస్తరణ
గత నెలలో ఢిల్లీలో జరిగని సమావేశంలో ప్రస్తుత కేబినెట్ లో ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, నలుగురికి తొలుత అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. సామాజిక – ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా వీరి ఎంపిక కసరత్తు నిర్వహించారు. తాజాగా ఉగాది నాడు గవర్నర్ తో సీఎం రేవంత్ సమావేశ సమయంలో నూ మంత్రివర్గ విస్తరణ గురించి వెల్లడించినట్లు తెలిసింది. అయితే, ఇప్పుడు విస్తరణ వేళ ఢిల్లీ కేంద్రంగా అనూహ్య పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి.
రాహుల్ గాంధీ
మంత్రివర్గ విస్తరణలో పేర్ల పైన రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. అందులో కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వటం పైన ప్రశ్నించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట రెడ్డి మంత్రిగా ఉండగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి తిరిగి అవకాశం ఏంటని రాహుల్ పార్టీ ముఖ్య నేతలను ప్రశ్నించినట్లుగా సమాచారం. అయితే, పార్టీలో చేరే సమయంలోనే వివేక్ తో పాటుగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ ఇచ్చినట్లు పార్టీ నేతలు వివరించారు. తాము పూర్తి స్థాయిలో ఆలోచన చేసిన తరువాత తుది నిర్ణయం చెప్పే వరకూ వేచి చూడాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సీనియర్ నేత జానా రెడ్డి పార్టీ హైకమాండ్ కు రాసిన లేఖ సంచనలంగా మారుతోంది.

ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, ఆ జిల్లాలకు అవకాశం ఇవ్వాలని జానారెడ్డి లేఖలో కోరారు. ఇదే సమయంలో సామాజిక వర్గాల వారీగా పలువురు నేతలు ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ముమ్మరం చేసారు. తమ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని పెద్ద ఎత్తున ఒత్తిడి పెంచుతున్నారు. ఇటు, ఇప్పటికే మంత్రివర్గంలో సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వాటికి శ్రీహరి, వివేక పేర్లు ఖరారైనట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడ రాహుల్ అభ్యంతరంతో ఈ పేర్ల లిస్టులో మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లు సామాజిక అంశాలు జిల్లాల కూర్పు తెర మీదకు రావటంతో ఈ నెల 3న మంత్రివర్గ విస్తరణ జరగటం సందేహంగానే కనిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ తో పాటుగా పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో, మంత్రివర్గ విస్తరణ పైన ఢిల్లీలో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.