అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమై.. ప్రచ్ఛన్న యుద్దంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతోంది. ఇరుదేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్.. చైనా మినహా మిగతా అన్ని దేశాలపై టారీఫ్లను 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు. చైనాపై మరిన్ని సుంకాలు విధించిన ఆయన.. మొత్తం 125 శాతానికి పెంచారు. అమెరికాకు చైనా దిగుమతులపై టారీఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించారు. అయితే, కేవలం చైనానే ట్రంప్ ఎందుకు టార్గెట్ చేశారు? చైనా-అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధానికి కారణాలు ఏంటి? ఇరు దేశాల మధ్య ఎగుమతుల్లో అంతరం, వాణిజ్య లోటే కారణమా? అనే చర్చ జరుగుతోంది.

ప్రపంచ ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం అమెరికాదే
దాదాపు 3.42 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా చైనా నిలిచింది. ఇందులో ఎక్కువ మొత్తంలో అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికా విషయానికి వస్తే 2024 ఆర్దిక సంవత్సరంలో దాని ఎగుమతుల విలువ సుమారు $1.71 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచ ఎగుమతుల్లో చైనా తర్వాతి స్థానం అమెరికాదే.
ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు
2024లో చైనా, అమెరికా వాణిజ్యం విలువ సుమారు 582.4 బిలియన్ల అమెరికా డాలర్లుగా అంచనా. 2024లో చైనాకు అమెరికా వస్తువుల ఎగుమతులు 143.5 బిలియన్ల డాలర్లు.. చైనా నుంచి దిగుమతులు మొత్తం 438.9 బిలియన్ డాలర్లు. అంటే, చైనాతో పోల్చితే వాణిజ్య లోటు 295.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ లోటును పూడ్చుకోడానికే పారిశ్రామిక, వ్యవసాయ వస్తువులు, ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చైనాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ తాజా సుంకాలు విధించారు.
READ ALSO: Trump Tariffs: అధిక సుంకాలను నిలిపివేసినా.. చైనాతో కొనసాగుతున్న వార్