అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వలసదారులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్.. అనుకున్నట్లుగానే అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయుల్ని స్వదేశానికి పంపేస్తున్నారు. ఇప్పటికే 104 మంది వలసదారులతో కూడిన విమానాన్ని భారత్ లోని అమృత్ సర్ కు పంపిన ట్రంప్.. ఇవాళ మరో విమానం పంపిస్తున్నారు. ఇందులో 119 మంది వలసదారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వివిధ రాష్ట్రాల వారు ఉన్నారు.
అమృత్ సర్ లో ల్యాండ్ కానున్నది
అమెరికాలో వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసల్ని గుర్తించే ఆపరేషన్ వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గుర్తించిన 119 మంది భారతీయుల్ని స్వదేశానికి పంపేశారు. ఇప్పుడు ఆ విమానం ఇవాళ అమృత్ సర్ లో ల్యాండ్ కాబోతోంది. అయితే తాజాగా అమెరికాలో ట్రంప్ ను కలిసిన మన ప్రధాని నరేంద్ర మోడీ వలసలపై చర్చలు జరిపారు. అయితే అక్రమ వలసల విషయంలో ట్రంప్ వైఖరితో మోదీ కూడా ఏకీభవించారు. దీంతో ట్రంప్ పని మరింత సులువైంది. భారత్ కు పంపాల్సిన వలసదారుల్ని వేగంగా గుర్తించి స్వదేశానికి పంపేయాలని ట్రంప్ ఆదేశాలు ఇచ్చేశారు.

కేంద్రంపై భగవంత్ సింగ్ మాన్ విమర్శలు
ఇవాళ అమృత్ సర్ కు రానున్న అమెరికా విమానంలో మొత్తం 119 మంది ఉండగా.. ఇందులో 67 మంది పంజాబ్ వారే ఉన్నారు. అలాగే హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ కు చెందిన 8 మంది, యూపీకి చెందిన ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ కు చెందిన తలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ కు చెందిన చెరొకరు ఉన్నారు. దీంతో పంజాబ్ ఆత్మరక్షణలో పడింది. అమెరికా నుంచి వలసదారులతో వస్తున్న విమానాల్ని ఇలా అమృత్ సర్ లో దింపడం ద్వారా తమ రాష్ట్రం పేరు చెడగొడుతున్నారంటూ సీఎం భగవంత్ సింగ్ మాన్ కేంద్రంపై విమర్శలకు దిగారు.
పునరావాసం కలిపిస్తాము
అయితే తమ రాష్ట్రానికి చెందిన వలసదారుల్ని మాత్రం ఎలాంటి వివక్ష లేకుండా ఆహ్వానిస్తామని కూడా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. వారిని గౌరవంగా స్వర్ణదేవాలయానికి తీసుకెళ్లి అనంతరం పునరావాసం కల్పిస్తామన్నారు. అయితే తమ రాష్ట్రం పరువు తీసేందుకే కేంద్రం ఇలాంటి చర్యలకు దిగుతోందన్నారు. అమెరికా విమానాన్ని ఢిల్లీ లేదా అహ్మదాబాద్ లో ల్యాండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ వాదనను సమర్థిస్తోంది. అక్రమ వలసు జాతీయ సమస్య అని దీన్ని పంజాబ్ కు పరిమితం చేయొద్దని కేంద్రానికి వీరు సూచిస్తున్నారు.