గత ఆరు నెలలుగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇప్పుడు తన దృష్టిని అటవీ శాఖపై సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, శాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన కృషి చేస్తున్నారు.అటవీ శాఖలో గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యలను గుర్తించిన పవన్ కల్యాణ్, ఆ శాఖను మరింత సమర్థవంతంగా చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులను వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా భూముల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, అనధికార ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. కడప అటవీ డివిజన్లో వచ్చిన భూఆక్రమణల ఫిర్యాదులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు.శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే విలువైన ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంపై పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విక్రయాలపై పటిష్ఠ నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
![పవన్ కల్యాణ్ అటవీ శాఖలో సమగ్ర మార్పులు పర్యవేక్షణ](https://vaartha.com/wp-content/uploads/2025/01/పవన్-కల్యాణ్-అటవీ-శాఖలో-సమగ్ర-మార్పులు-పర్యవేక్షణ-1.jpg.webp)
సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను బలపరచాలని, ఈ అక్రమ రవాణాను పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.అటవీ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచడం, స్థానిక గిరిజనులను ఈ ప్రక్రియలో భాగస్వాములుగా చేయడం పవన్ కల్యాణ్ ప్రాధాన్యంగా తీసుకున్నారు. పర్యావరణ పచ్చదనాన్ని 50% పెంచేందుకు, కలప ఉత్పత్తుల ద్వారా దేశ అవసరాలను తీరుస్తూ దిగుమతులను తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.వన్యప్రాణుల రక్షణ, గిరిజనుల చైతన్యం పెంపు, అడవుల్లో వేటను నియంత్రించడం తదితర అంశాలను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మదపుటేనుగుల సమస్యపై సమీక్ష నిర్వహించి, కర్ణాటక ప్రభుత్వం సహకారంతో కుంకీ ఏనుగులను తేవాలని సూచించారు. 2047 నాటికి కలప ఉత్పత్తుల ఎగుమతిలో భారతదేశం ప్రధాన స్థానంలో నిలవాలని లక్ష్యంగా, రాష్ట్రం నుంచి కలప ఉత్పత్తుల అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.