మహారాష్ట్రలోని పూణే నగరంలో ఇటీవల ఓ 26 ఏళ్ల యువతిపై పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలోనే బస్సులో అత్యాచారం జరగడం.. మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణం అయింది. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రతిపక్షంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలు.. ఘటన జరిగిన బస్టాప్ను కూల్చి వేశారు. బస్సులపై దాడులు చేశారు. దీంతో పరిస్థితి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార మహాయుతి కూటమిపై ప్రతిపక్ష మహా వికాస్ ఆఘాడీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.
దర్యాప్తు, కఠిన చర్యలు
ఈ నేపథ్యంలోనే ఈ పూణే అత్యాచార ఘటనను ఉద్దేశించి మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందించారు. సరైన దర్యాప్తు, కఠిన చర్యలు అవసరమని తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 2013లో జరిగిన నిర్భయ ఘటన తర్వాత.. మన చట్టాల్లో ఎన్నో మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అయితే కేవలం కొత్త కొత్త కఠిన చట్టాలను తీసుకురావడంతో ఇలాంటి క్రూరమైన ఘటనలు జరగకుండా ఆపలేమని తెలిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్.. మహిళల భద్రత, రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

బాధ్యత ప్రతీ ఒక్కరిపై వుంది
మహిళలు ఎక్కడికి వెళ్లినా.. తాము సురక్షితంగా ఉన్నాం అనే నమ్మకాన్ని వారిలో కలిగించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇక ఇలాంటి అత్యాచార కేసుల్లో సరైన దర్యాప్తు నిర్వహించి.. నిందితులను పట్టుకుని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని గుర్తు చేశారు. ఇందుకోసం మన న్యాయవ్యవస్థ, పోలీస్ శాఖలపై పెద్ద బాధ్యత ఉందని తెలిపారు. పోలీసులు, చట్టాలే కాకుండా సమాజానికి కూడా బాధ్యత ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ తేల్చి చెప్పారు.
పూణేలోని రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాప్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి గుర్తింపు
సతారా జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువతి.. ఇళ్లల్లో పని చేసుకుని జీవనం సాగించేది. అయితే బస్టాప్లో బస్సు కోసం వెళ్లేందుకు చూస్తున్న యువతిని గమనించిన దత్తాత్రేయ రామదాస్ అనే 36 ఏళ్ల వ్యక్తి.. బస్సు కొంత దూరంలో ఉందని చెప్పి నమ్మించి.. అక్కడికి వెళ్లిన తర్వాత బస్సులో అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఆ బస్సు స్థానిక పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. అతడిపై అనేక కేసులు ఉన్నాయని.. 2019లో బెయిల్పై బయటికి వచ్చినట్లు తేల్చారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 8 స్పెషల్ టీమ్స్ను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే నిందితుడికి సంబంధించి ఫోటోను విడుదల చేసిన పోలీసులు.. అతడిపై రూ.1 లక్ష రివార్డును ప్రకటించారు.