ఇటీవలి కాలంలో దేశీయంగా సైబర్ నేరాల సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలోని ప్రజలతో పాటు పెద్ద వయస్సు వారిని నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వీటి ద్వారా ప్రజలు ఏటా కోట్ల రూపాయలు నష్టపోతున్నారు.
జోష్ణా అనే మహిళకు వింత అనుభవం
ఈ క్రమంలోనే తాజాగా నోయిడాలో జోష్ణా అనే మహిళకు వింత అనుభవం ఎదురైంది. అయితే ఇటీవల ఆమెకు ఒక వాట్సాప్ కాల్ వచ్చింది. అందులో నిందితులు తాము మెుబైల్ సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ప్రతినిధులుగా పేర్కొంటూ ఇ-సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఫోన్ పోయిన సందర్భంలో ఆమె తన నంబర్ కోల్పోకుండా ఉండటానికి ఇది దోహదపడుతుందని ఆమెకు వారు వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా ఫిజికల్ కార్డు రెండుమూడు రోజుల్లో వచ్చేస్తుందని భావించిన ఆమె ఈ క్రమంలో ప్రక్రియను పూర్తి చేయటానికి ఎస్ఎమ్ఎస్ ద్వారా వచ్చిన కోడ్ వివరాలను నిందితులతో పంచుకున్నారు.
బ్యాంకు ఖాతాలు ఖాళీ
గడువు ముగిసినా కొత్త సిమ్ రాకపోవటంతో ఆమె కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ను సంప్రదించగా వారు కొత్త డూప్లికేట్ సిమ్ కార్డును పొందాలని సూచించారు. దీంతో కార్డును తీసుకుని రీయాక్టివేట్ చేసుకోగానే తాను మోసానికి గురైనట్లు ఆమె గుర్తించింది. ఈ క్రమంలో నిందితులు ఆమెకు చెందిన రెండు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయటంతో పాటు బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను విత్ డ్రా చేసినట్లు గుర్తించింది. అలాగే నిందితులు ఆమె పేరుమీద దాదాపు రూ.7.4 లక్షల మేర కారు లోన్ కూడా తీసుకున్నారు. పోలీసులను సంప్రదించి కేసు పెట్టే సమయానికి జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. దీనికి ముందు సైతం ముంబైలో ఒక వ్యాపారవేత్తను నిందితులు ఇలాగే మోసం చేసిన సంఘటన బయటపడింది. ఈ క్రమంలో వారు సదరు వ్యాపారి ఖాతా నుంచి రూ.7.5 కోట్లను తస్కరించారు. సైబర్ నేరగాళ్లు టెలికాం ప్రొవైడర్ను వారి నియంత్రణలో ఉన్న సిమ్కి నంబర్ను లింక్ చేయమని ఒప్పించారు. వన్-టైమ్ పాస్వర్డ్లను నేరుగా పొందిన నిందితులు ఖాతాను ఖాళీ చేయించారు. అప్రమత్తమైన వ్యాపారి వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి కాల్ చేశాడు. దీంతో అధికారులు బదిలీ చేయబడటానికి ముందు రూ.4.65 కోట్లను స్తంభింపజేయగలిగారు. దీంతో భారీ నష్టాన్ని వారు నిరోధించగలిగారు.
మార్కెట్లో రకరకాల మోసాలు
ప్రస్తుతం సిమ్ కార్డుల ద్వారా మార్కెట్లో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. సిమ్ బ్లాకింగ్ స్కామ్, సిమ్ స్వాప్ స్కామ్, సిమ్ క్లోజింగ్ స్కామ్, ఫేక్ కేవైసీ స్కామ్ రూపాల్లో ఇవి జరుగుతున్నాయి. ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందటానికి ప్రజలు.. అకస్మాత్తుగా సిమ్ కార్డు డీయాక్టివేట్ అవటాన్ని వెంటనే గుర్తించి జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధం లేని ట్రాన్సాక్షలకు సంబంధించి ఓటీపీలు రావటం, కేవైసీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలంటూ వచ్చే లింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

సిమ్ కార్డులతో కొత్త మోసం- జాగ్రత్త సుమా!
Advertisements