ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, నాగబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం మండలి చైర్మన్ కార్యాలయంలో జరగగా, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, జనసేన నేతలు హాజరయ్యారు. భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను ప్రదర్శిస్తానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని నాగబాబు ప్రమాణం చేశారు.

తర్వాత నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం కార్యాలయానికి వెళ్లిన నాగబాబు దంపతులు చంద్రబాబుకు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, నాగబాబుకు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయనకు శాలువా కప్పి వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు.ఇదిలా ఉండగా నాగబాబు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీకి ఇది మరింత బలాన్ని చేకూరుస్తుందని నేతలు అంటున్నారు. శాసన మండలిలో జనసేన శబ్దం ఎలా ఉంటుందో వేచి చూడాలి.