భారత్కు యుద్ద ముప్పు .. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు భారత్కు ఇద్దరు పొరుగు దేశాల నుంచి ఒకేసారి యుద్ధ ముప్పు పెరుగుతోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సైనిక సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, బంగ్లాదేశ్ అంశం వంటి వివిధ విషయాలపై స్పందించారు. దాయాది దేశమైన పాకిస్థాన్ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారిందని, ఇప్పుడు అది చైనా తోడుగా నిలవడం గమనార్హమని పేర్కొన్నారు. భారత్కు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు కుమ్మక్కవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. పాకిస్థాన్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగించేందుకు చైనా సహాయపడుతున్నట్టు చెప్పడానికి అనేక సంకేతాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

సైనిక దళాలు ఎప్పుడూ సిద్ధం
చైనాలో ఉత్పత్తి అయ్యే అత్యాధునిక ఆయుధాలను పాకిస్థాన్ వినియోగిస్తున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయని ద్వివేది తెలిపారు. ఇలాంటి పరిణామాలు భవిష్యత్లో భారత్పై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని, అందుకే సైనికంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని చెప్పారు. భారత్పై ముష్కర చర్యలకు పాల్పడే ఉగ్రవాద సంస్థలకు పాక్ ప్రోత్సాహం అందిస్తోందని, చైనా కూడా పరోక్షంగా దీన్ని సమర్థిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ సైనిక పరంగా అత్యంత శక్తివంతమైన దేశమని, ఎవరైనా సవాలు విసిరితే తగిన విధంగా బదులివ్వగల సామర్థ్యం మనదని ద్వివేది ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింతగా పటిష్ఠం చేసినట్టు ఆయన తెలిపారు. సైనిక దళాలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని, అవసరమైతే ఏదైనా కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.
భారత్ తన భద్రతా వ్యూహాన్ని నిరంతరం అప్డేట్
బంగ్లాదేశ్పై మాట్లాడుతూ, ఆ దేశంతో ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేవని, భారత్-బంగ్లాదేశ్ సైనిక సంబంధాలు బలంగా ఉన్నాయని ద్వివేది పేర్కొన్నారు. అయితే భవిష్యత్లో అక్కడి రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయో చూడాల్సి ఉందని, ఇప్పుడే ఎలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుందని అన్నారు.భారత్ తన భద్రతా వ్యూహాన్ని నిరంతరం అప్డేట్ చేసుకుంటోందని, తాజా పరిణామాలను గమనిస్తూ సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి చర్యలు తీసుకుంటుందని ద్వివేది తెలిపారు. దేశ రక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సైనిక రంగంలో కొత్త సాంకేతికతను సమృద్ధిగా వినియోగిస్తున్నామని ఆయన వివరించారు. భవిష్యత్లో భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు జరిగినా తగిన ప్రతిస్పందన ఇస్తామని, అవసరమైతే రెండు ఫ్రంట్లలో కూడా యుద్ధం చేయగలమని ఆయన స్పష్టం చేశారు. భారత సైన్యం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, దేశ భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ద్వివేది కుండబద్దలు కొట్టారు.