భారతీయ సంప్రదాయంలో పండగలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా వీటిని జరుపుకొంటారు. చదువుల కోసం, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారం చేస్తూ వేరే ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ తమ సొంటి గూటికి చేరుకుంటారు. ప్రస్తుతం దేశంలో మరో ప్రముఖ పండగ సందడి మొదలైంది. మార్చి 13, 14 తేదీల్లో అందరికీ ఇష్టమైన హోలీ పండగ రానుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడంలో బిజీగా ఉంటారు. అయితే ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే తక్షణమే టిక్కెట్లను బుక్ చేసుకునే వీలుంటుంది. హోలీ పండగకు ఇంకా కేవలం ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. సొంతూళ్లకు రావడానికి ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ పని ఒత్తిడిలో పడి టిక్కెట్లు రిజిర్వేషన్ చేసుకోనివారు మాత్రం హైరానా పడుతుంటారు. ఇలాంటి వారు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో ఈ కింది తెలిపిన చిట్కాలను పాటిస్తే ధ్రువీకరించిన టిక్కెట్లను వెంటనే బుక్ చేసుకోవచ్చు. సమయం ఆలస్యం కాకుండా త్వరితగతిన తీసుకునే అవకాశం కలుగుతుంది.

ఐఆర్ సీటీసీ యాప్
రైలులో ప్రయాణించాలనుకునే వారందరూ ముందుగా ఐఆర్ సీటీసీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిలోకి లాగిన్ అవ్వండి. మీరు ఎక్కాల్సిన రైలు పేరు, నంబర్ను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకునే సమయంలో వేర్వేరు రైలు నంబర్లు, మార్గాలను నమోదు చేయాల్సిన అవసరం లేకుండా ముందుగానే వాటిని సేవ్ చేసుకోండి.
మాస్టర్ లిస్ట్
ధ్రువీకరించిన టిక్కెట్లను పొందడం కోసం ముందుగానే ప్రయాణికుల మాస్టర్ లిస్ట్ను సిద్ధం చేయాలి. దీనిలో ప్రయాణించేవారి పేర్లు, బెర్త్ ప్రాధాన్యతలు, ఆహార ప్రాధాన్యతలను నమోదు చేసుకోవచ్చు. ఈ సమాచారమంతా ముందుగానే సేవ్ చేసుకోవడం వల్ల టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు మీ సమయం ఆదా అవుతుంది. ఐఆర్సీటీసీ ఖాతాలోని మై ప్రొఫైల్ అనే విభాగానికి వెళ్లడం ద్వారా మాస్టర్ జాబితాను తయారు చేసుకోవచ్చు.
ఇ-వాలెట్
టిక్కెట్ల సొమ్మును త్వరితగతిన చెల్లించడానికి యూపీఐ వాలెట్ ఉపయోగించడం మంచిది. దీని ద్వారా త్వరితగతిన చెల్లించే అవకాశం కలుగుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కన్నా ఇదే మంచి విధానం. ఎందుకంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్లో లాగిన్, పాస్వర్డ్, ఓటీపీ నమోదు చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు ద్వారా ఐఆర్సీటీసీ ఇ-వాలెట్కు డబ్బును పంపవచ్చు. తత్కాల్ టిక్కెట్లు పొందాలనుకుంటే ముందుగా టైమింగ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. స్లీపర్ క్లాస్ టిక్కెట్ల కోసం ఉదయం 10:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. ఎసీ టిక్కెట్ల కోసం ఉదయం 11:00 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది. సరిగ్గా అదే సమయంలో ప్రయత్నించండి. టిక్కెట్ల బుకింగ్ సమయంలో మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం చాలా అవసరం. మొబైల్ డేటా కన్నా బ్రాడ్బ్యాండ్ లేదా ఫైబర్ కనెక్షన్ను ఉపయోగించడం ఉత్తమం. బుకింగ్ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా పేమెంట్ ఆప్షన్లను ముందుగా సిద్ధం చేసుకోవడం అవసరం. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా యూపీఐ వివరాలను సేవ్ చేసుకోవడం ద్వారా బుకింగ్ వేగంగా పూర్తవుతుంది. ఒకే రైలుపై ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయ రైళ్లను పరిశీలించండి. అవసరమైన సందర్భాల్లో వైట్ లిస్ట్ లేదా రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సలేషన్ (RAC) టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు రైలు టిక్కెట్లు అందుబాటులో లేకపోతే బస్సులు, ఫ్లైట్ టిక్కెట్లు కూడా పరిశీలించండి. ముఖ్యంగా హోలీ వంటి పెద్ద పండుగల సమయంలో ట్రాన్స్పోర్ట్ సర్వీసులను ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. ఈ చిట్కాలను పాటిస్తే రైలు టిక్కెట్లను సమయానికి పొందే అవకాశం ఉంది. పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.