గూగుల్ మ్యాప్స్ నమ్మి ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. తన కారుతో సహా 30 అడుగుల లోతైన కాలువలో పడి దుర్మరణం చెందాడు. నోయిడాలో ఈ ఘటన వెలుచూసింది. ఆ మ్యాప్ తప్పు మార్గాన్ని చూపించి ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. కానీ పోలీసులు ఈ ఘటనపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మృతుడిని ఢిల్లీలోని మండవలి నివాసి భరత్ సింగ్( 31) గా గుర్తించారు. ఆయన స్టేషన్ మాస్టర్గా పనిచేస్తున్నారని వార్తా సంస్థ పిటిఐ వెల్లడించింది. ఈ సంఘటన మార్చి 1వ తేదీ శనివారం గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ P4లో జరిగిందని పోలీసులు తెలిపారు. భరత్ సింగ్ ఒక వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.
పోలీసులకు సమాచారం
శనివారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కేంద్రీయ విహార్ ప్రాంతం సమీపంలోని కాలువలో కారు పడిపోయినట్లు పోలీసులకు సమాచారం అందిందని బీటా 2 పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి విజయ్ కుమార్ తెలిపారు. భరత్ సింగ్ రాణి రాంపూర్లో ఒక వివాహ కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని కుమార్ తెలిపారు. రోడ్డు చివర ఎటువంటి హెచ్చరిక బోర్డులు లేవని, దీనివల్ల కారు నియంత్రణ కోల్పోయి కాలువలో పడి ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు.
హెచ్చరిక బోర్డులు లేవు
కారు వేగంగా వెళుతోందని, అకస్మాత్తుగా కాలువలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి సౌరభ్ తెలిపారు. స్థానికులు సహాయం చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ కారు బోల్తా పడి నీటితో నిండిపోయింది. కాలువల దగ్గర హెచ్చరిక బోర్డులు లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతుందని స్థానికులు చెబుతున్నారు. కాగా భరత్ సింగ్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో నావిగేట్ చేస్తున్నప్పుడు డెడ్ ఎండ్ వద్ద ప్రమాదం జరిగి ఉండవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.