ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పారిశ్రామికంగా ఏపీ వేగంగా అభివృద్ధిని సాధిస్తోంది.తిరుపతిలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ను రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టింది.
గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్ ప్లాంట్
సాంకేతికత కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని, భారతదేశ శక్తి పరివర్తనకు కొత్త బెంచ్మార్క్ను నిర్దేశిస్తుందని వివరించారు. తిరుపతిలో ప్రవేశపెట్టిన స్కేలబుల్ మోడల్ను ఆంధ్రప్రదేశ్లోనూ, ఇంకా దేశవ్యాప్తంగా ఇతర పరిశ్రమల్లోనూ అనుకరించవచ్చని చెప్పారు.
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్
ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఎండీ, చైర్మన్ రాహుల్ ముంజల్, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్ సీఈవో శ్రీవాత్సన్ అయ్యర్, రాక్మాన్ ఇండస్ట్రీస్ ఎండీ ఉజ్వల్ ముంజల్, రాక్మాన్ ఇండస్ట్రీస్ సీఈవో కౌసిక్ మన్నా, ఓహ్మియం సీఈవో ఆర్నే బాలంటైన్ పాల్గొన్నారు.
లక్ష్యానికి తొలి అడుగు
స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో పేర్కొన్నట్టుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో ఏపీని ప్రపంచ కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఇది తొలి అడుగు అవుతుందన్నారు. రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద 160 గెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని, క్లీన్ ఎనర్జీలో రూ.10 ట్రిలియన్ పెట్టుబడిని సాధిస్తామనే విశ్వాసం ఉందన్నారు.శిలాజ ఇంధనాలపై ఆంధ్రప్రదేశ్ ఆధారపడటం తగ్గించడానికి, 2070 నాటికి భారతదేశం యొక్క నెట్-జీరో లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, ఇంధన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.”గ్రీన్ ఎనర్జీ ప్లాంట్తో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ జైత్రయాత్ర మొదలు కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో వాణిజ్యానికి ఉన్న అనుకూల విధానాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి హీరో ఫ్యూచర్ ఎనర్జీస్కు సహకారం అందిస్తాయి” అని ముఖ్యమంత్రి చెప్పారు.

వనరులను వినియోగించుకోండి
విస్తారమైన తీరప్రాంతం, లోతైన సముద్ర ఓడరేవులు, బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్తో ఆంధ్రప్రదేశ్ దేశీయ, ప్రపంచ మార్కెట్ అవసరాలను తీర్చడానికి, గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులకు కేంద్రంగా మారడానికి ఆంధ్రప్రదేశ్ అనువైందని. రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో రెండు వేల మందికి ఉపాధి కల్పించేలా ప్లాంట్ నెలకొల్పడంతో తిరుపతి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు.
ప్రాజెక్టుతో ఎన్నో లాభాలు
రూ. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలుగుతుంది. ఏడాదికి 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఏడాదికి 54 టన్నులకు పెంచుకునే అవకాశం ఉంది. ఏడాదికి 206 టన్నుల కార్బన్ ఢై ఆక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతో పాటు, వాతావరణంలోకి ఏడాదికి 190 నుంచి 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. మొత్తం 8 శాతం నుంచి 10 శాతం ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది.