YSRCP : వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చకు వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. బుధవారం లోక్సభలో చర్చకు వచ్చిన సందర్భంగా వైసీపీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ముస్లిం మనోభావాలు పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ సభ్యులు సభలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

రెండు సభల్లో బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది
కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం లోక్సభ చర్చ చేపట్టింది. గురువారం రాజ్యసభలో డిస్కషన్ జరిగింది. ఈ రెండు సభల్లో కూడా తన అభిప్రాయాన్ని వైసీపీ చెప్పుకొచ్చింది. రెండు సభల్లో బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులు కాలరాస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ధ్వజమెత్తారు.
ఇది పూర్తిగా భూములకు సంబంధించిన అంశమే
కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులకు ఛాన్స్ ఇవ్వడమంటే రాజ్యంగ ఉల్లంఘనేనంటూ మండిపడ్డారు. వార్షిక సహకారం 5 శాతానికి తగ్గించి వారి ఆర్థిక స్వేచ్ఛను దెబ్బ తీసి ఆర్థికంగా కుంగదీస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణాల వల్లే ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించిందని తెలిపారు. ఇది పూర్తిగా భూములకు సంబంధించిన అంశమే కాదని ఇది ముస్లిం మనోభావాలతో ముడిపడిన అంశంగా పేర్కొన్నారు. వాటిని దెబ్బతీసేలా ప్రభుత్వాల చర్యలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు.